ప్రజావాణి కార్యక్రమం – ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలు
22 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి తక్షణ చర్యలు – ఎస్పీ టి. శ్రీనివాస రావు,
జోగుళాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి మరొక సమర్థ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుంచి వచ్చిన మొత్తం 22 ఫిర్యాదులను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, స్వయంగా స్వీకరించి బాధితులతో నేరుగా మాట్లాడారు.
ప్రతి అర్జీని శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ , సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో తక్షణం సంప్రదించి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితులకు ఆలస్యం లేకుండా న్యాయం జరిగేలా పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజల నమ్మకం పోలీస్ శాఖకు అత్యంత ముఖ్యమైనది.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 02 గంటల వరకు, మంగళవారం నుంచి శనివారం వరకు అన్ని పని దినాలలో మధ్యాహ్నం 03 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు నిర్వహించే ప్రజావాణి ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఎక్కడైనా న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా స్థాయిలో మమ్మల్ని సంప్రదించాలి” అని పేర్కొన్నారు.
భూ వివాదాలు, ఆస్తి సమస్యలు, కుటుంబ కలహాలు వంటి అంశాల్లో చట్టపరమైన పరిష్కారమే తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారమయ్యాయో నిరంతరం సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు అందిన ఫిర్యాదుల వివరాలు: కూతుర్లు అన్నం పెట్టడంలేదని – 02, చీటింగ్ కు సంబంధించి – 02, గొడవలు – 04, , భూ వివాదాలు సంబంధించి– 12, కుటుంబ వివాదాలు సంబంధించి – 01, ఇతర సమస్యలు – 01, మొత్తం: 22 ఫిర్యాదులు
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.