రంగుల వలయ పూల మొక్కల మాయతో యలమందా జర నీ గొర్రెల మందలు పైలం
ఆదమరిస్తే అవి ఆరగించే లోపులో శరీరం విషమయం - ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రోడ్డు పక్కన విరబూసిన అందమైన పూల అలం మాయ
– గొర్రెలు మేకల ప్రాణాలతో చెలగాటం
కోదాడ పట్టణం బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన కొందరు నూతన గొర్రెల పెంపకం దారులు తమ గొర్రెలు మేత మేస్తూనే చూస్తుండగానే అకస్మాతుగా ఒళ్ళు బెందులు , వాపులతో కండ్లు ఎర్రబారి వాయడం , వెంటనే పసుపురంగులోకి మారడం , తదుపరి కళ్ళల్లో తెల్లటి పొరలు వచ్చికళ్ళు కనిపించకుండా, కిందపడి లేవలేకపోయి జబ్బుపడుతున్డడంతో బెంబేలు పడుతూ గొర్రెల్ని ప్రాంతీయ పశువైద్యశాల కోదాడకు తీసుకురావడం జరిగింది. వాటిని పరిశీలించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా.పి.పెంటయ్య చికిత్స అందించి విషపూరిత మొక్కల ఆకులు తినడం వళ్ళ ఈ వ్యాధి సోకుతుందని ఈ వ్యాధి బారిన పడకుండా జీవాల పెంపకం దారులకు సూచనలు ఇచ్చారు.
కేసుల పూర్వపరాలను పరిశీలిస్తే , లాంటినా అనే పేరుగల అందమైన రంగు రంగుల పూల గుత్తులతో విరబూసి, ఆకుపచ్చని ఆకులతో అత్యంత అందంగా ఆకర్షనీయంగా చూపరులను ఆకర్షించే కలుపుమొక్కలు రోడ్లకిరువైపులా కాలువ గట్లపై విరివిగా పెరుగుతుంటాయి. కాలంతో సంబంధం లేకుండా సంవత్సరములో ౩65 రోజులు గుత్తులు గుత్తులుగా రంగు రంగుల చక్కటి పూలు పూయడం వీటి ప్రత్యేకత .గొర్రెల కాపరులు ప్రతిరోజూ తమ మందలను మేతకు తోలుకుపోయే సమయములో సహజంగానే గొర్రెలు మేకలు ఈ రంగుల పూల మాయలో పడి హడావుడిగా మొక్క ఆకులు తినడం కోసం ప్రయత్నం చేస్తుంటాయి. వీటి గురించి తెలిసిన కాపరులు జాగరూకతో వాటిని అదిలిస్తూ ఆకులను తినకుండా చూసుకుంటారు. ఈ మొక్క గురించి తెలియని వారు మరియు కొత్తగా గొర్రెలు మేకలు పెంచేవారు గొర్రెలు తింటున్నా పట్టించుకోరు.తీరా తిన్నాక వెంటనే గొర్రెల చెవులు కళ్ళు వాచిపోవడం అధిక జ్వరం , మేతమేయకపోవడం కళ్ళు పచ్చబారడం , ఇంకా ఆలస్యం అయితే విషప్రభావం నాడి వ్యవస్థకు చేరి ప్రాణాంతకం కూడా అవుతుంది. ఆకులు తినగానే ఆకుల్లోని విషపదార్థం నేరుగా కాలేయం పై ప్రభావం చూపడం వలన ఒళ్ళంతా వాపులు , సున్నిత ప్రాంతాలైన కండ్లు , చెవులు తోక కిందిభాగం విపరీతంగా ఉబ్బి , కామెర్లు సోకిన కళ్ళ వలే పూర్తిగా పసుపురంగులోకి మారడం జరుగుతుంది. తిన్న ఆకుల మొతాదు బట్టి విషప్రభావం ఉంటుంది .దాని ప్రకారం చికిత్స ఆధారపడి ఉంటుంది.
గ్రామాల్లో వాడుక భాషలో గాజులమల్లారం అని పిలిచే ఈ వ్యాధి భారిన పడ్డ జీవాలకు సకాలంలో వైద్యం అందని ఎడల మృత్యువాత పడుతుంటాయి.
గొర్రెలు మేకలు పెంచుకునే రైతులు ఈ మొక్కల గురించి విధిగా తెలుసుకోవాలి . వీలైనంత వరకు జీవాలు వీటిని తినకుండా జాగ్రత్త వహించాలి. పొరపాటున తిన్నట్లయితే ఆలస్యం చేయకుండా దగ్గరలోని పశువైద్యాధికారిని సంప్రదించి సత్వర చికిత్సలు అందించి తమ జీవాల్ని రక్షించుకోవాలి అని తెలియజేశారు.