బుల్లెట్ అలైన్మెంట్ మార్చొద్దు.. పాత రూట్లోనే పట్టాలెక్కాలి
సూర్యాపేట, నల్లగొండ మీదుగానే ట్రైన్ వెళ్లాలి
రూట్ మార్పుపై ప్రజల్లో ఆందోళన ఉంది
బీజేపీ, కాంగ్రెస్ నేతలు సర్కార్లను ఒప్పించాలి
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్
సూర్యాపేట 26 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- శంషాబాద్ నుంచి నల్లగొండ, సూర్యాపేట మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను మార్చవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూట్ మారుస్తున్నారనే ప్రచారంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధికి బుల్లెట్ ట్రైన్ ఎంతో కీలకమన్నారు. గతంలో ప్రకటించిన ప్లాన్ ప్రకారం శంషాబాద్ - చెన్నై బుల్లెట్ ట్రైన్ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా వెళ్తుందని చెప్పడంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. బుల్లెట్ ట్రైన్ అన్ని స్టేషన్లలో ఆగకపోయినా, జిల్లా కేంద్రాలకు అందుబాటులో ఉండటం వల్ల ఈ ఏరియా పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో ఎదిగే అవకాశం ఉందన్నారు. కానీ, ఇప్పుడు పాత అలైన్మెంట్ మార్చి వేరే వైపు నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. అందరం కలిసి పోరాడుదాం.. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని జగదీశ్ రెడ్డి కోరారు. ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ తమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి, పాత పద్ధతిలోనే ట్రైన్ వచ్చేలా చూడాలన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాల కోసం తాము కూడా పూర్తి సహకారం అందిస్తామని, అందరం కలిసి పాత రూట్లోనే బుల్లెట్ ట్రైన్ వచ్చేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.