నా భూమి ని నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి మహాప్రభో

నాగారం ఏప్రిల్ 25 తెలంగాణ వార్త : నా భూమిని నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి మహా ప్రభో అని మండల పరిధిలోని వర్ధమానుకోట కు చెందిన బుర్ర మణెమ్మ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టరు కు మొర పెట్టుకున్నారు. శుక్రవారం నాగారం మండల పరిధిలోని ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేను కష్టపడి సర్వేనెంబర్ 559/అ/2 లో 39 గంటల భూమిని కొనుగులు చేసినను అని అన్నారు. అట్టి భూమిని నా కొడుకు అయినా బుర్ర నరేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినానని తెలిపారు. 2021లో నా కొడుకు అనారోగ్యంతో మరణించగానే నాకు తెలియకుండా రెవెన్యూ అధికారులకు లంచం ఇచ్చి దొంగచాటుగా ఆ భూమిని నా కోడలు పేరు మీదికి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న మా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మార్పించారని వాపోయారు. విషయం తెలుసుకొని నాకు అన్యాయం చేయవద్దని ఆ పెద్దమనిషి కాళ్ల మీద పడగా నన్ను కాళ్లతో తన్ని నెట్టివేసినాడని ఆవేదన వ్యక్తం చేశారు. నా భూమిని నాకు తెలియకుండా మార్పించడానికి మీరు ఎవరు అని గట్టిగా నిలధీసి అడగడంతో నా కోడలు పేరుమీద నుండి మరో బిఆర్ఎస్ పార్టీ నాయకుడి పేరు మీద కి మార్పించినారని ఆరోపించారు. మా గ్రామానికి చెందిన పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నా భూమిని కాజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నా భూమిని నాకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నానని అన్నారు. నాకు న్యాయం జరగక పోతే నాకు చావేదిక్కు అని ఆమె అన్నారు.