గద్వాల్లో సంస్కార్ పాఠశాలలో పర్యావరణ విద్య అవగాహన కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 28 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల్. పట్టణం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలోని సంస్కార్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) మరియు తెలంగాణ జాతీయ హరిత దళం (TGNGC) ఆధ్వర్యంలో పాఠశాలల్లో పర్యావరణ విద్యా కార్యక్రమాలు (EEP) భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎకో-క్లబ్ కార్యకలాపాలు, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, సీడ్ బాల్ తయారీ, “వ్యర్థాల నుండి సంపద” ప్రదర్శనలు, జీవ వైవిధ్యంపై అభ్యాస కార్యక్రమాలు విద్యార్థులకు నిర్వహించారు. ఇందులో భాగంగా విత్తన బంతుల (Seed Balls) తయారీ మరియు చిరుధాన్యాల (Millets)పై అవగాహన సదస్సు నేషనల్ గ్రీన్ కోర్ (NGC ) జిల్లా కోఆర్డినేటర్ మరియు పర్యావరణ విద్య ప్రచారకర్త సాక శ్రీధర్ నేతృత్వంలో ఘనంగా జరిగింది.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణలో తమ బాధ్యతను చాటుకున్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను విద్యార్థులు ప్రదర్శించి, వాటిలోని పోషక విలువలను వివరించారు. ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అలాగే విత్తన బంతుల తయారీ ద్వారా పచ్చదనం పెంపొందించడంలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల కృషిని అభినందిస్తూ పాఠశాల చైర్మన్ వి. మధులిక గోవర్ధన్ రెడ్డి , డైరెక్టర్ వి. సంధ్య శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ వి. సంధ్యారెడ్డి మరియు సిబ్బంది విద్యార్థులకు జనపనార సంచులు (జ్యూట్ బ్యాగ్స్) అందజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది.