వంతెన కూలీ 3 నెలలు అయిన పట్టించుకోని అధికారులు.
నూతన వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి.
కూలిన వంతెనను పరిశీలించిన.
బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు
జోగులాంబ గద్వాల 28 మార్చ్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల పరిధిలోని మునగాల శివారులో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు యొక్క కుడి కాలువపై వంతెన కూలిపోయి మూడు నెలలైనా అధికారులు పట్టించుకోవడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. ఫలితంగా రైతులకు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడమే కాకుండా సాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. శనివారం స్థానిక రైతులతో కలిసి కూలిపోయిన వంతెనను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలు విన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ 5న వంతెన కూలిపోయిన నేటికీ అధికారులు ఆ వైపు తొంగి చూడడం లేదన్నారు. వంతెనకు ఇరువైపులా ఉన్న పంట పొలాలకు వెళ్లాలంటే సుదూరాగంగా ప్రయాణించి చేరుకోవలసిన దుస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. అదేవిధంగా సాగునీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి అన్నారు. రబీ సీజన్ లో మొక్కజొన్న, జొన్న, ఆముదం, చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కుడి కాలువకు నీటిమట్టం ఎక్కువైతే వంతెన పైనుండి ప్రవహించి గ్రామాలలోకి చేరుకుని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వర్షాకాలంలో పంటలను సాగు చేసే వ్యవసాయ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నూతన వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు రామకృష్ణ, రవికుమార్ పాల్గొన్నారు.