అరైవ్ అలైవ్’తో రోడ్డు భద్రతకు భరోసా
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో విస్తృత అవగాహన
జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల తెలంగాణ పోలీస్ శాఖi ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అరైవ్ అలైవ్’ దశ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమం జోగుళాంబ గద్వాల్ జిల్లాలో విస్తృతంగా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది.
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగం, హెల్మెట్, సీట్బెల్ట్ ధరించకపోవడం వంటి కారణాల వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలకు వివరించారు.
రోడ్డు ప్రమాదాల వల్ల బాధిత కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలు, ప్రమాదాల్లో గాయపడిన వారి అనుభవాలను ప్రజలతో పంచుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను ఎలా నివారించవచ్చో స్పష్టంగా తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీట్బెల్ట్ ఉపయోగించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. వాహనాలను పరిమిత వేగంతోనే నడపాలని సూచించారు.
ప్రత్యేకంగా యువత ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే అనేక ప్రాణాలు కాపాడవచ్చని పోలీసులు తెలిపారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమే ‘Arrive Alive’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నిబంధనల అమలు కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్ను పూర్తిగా అరికట్టాలని, ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
—