గద్వాల్లో NEET పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
పరీక్షా కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా ఎస్పీశ్రీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.,
జోగులాంబ గద్వాల 22 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : నీట్ పరీక్షల సందర్భంగా గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను, అక్కడి భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణకు నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు భద్రతను కల్పించినట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్.ఎస్. (BNSS) సెక్షన్ 163 అమలులో ఉంటుందన్నారు.
పరీక్షా సామాగ్రి మరియు ప్రశ్నాపత్రాల తరలింపులో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తుగా ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు తీసుకుని, అదనపు సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ కె. శంకర్ గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య , గద్వాల సి ఐ టంగుటూరి శ్రీను, ఇతర పోలీస్ అధికారులు, పరీక్ష నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.