నానక్‌రాంగూడలో గంజాయి విక్రయాల నెట్‌వర్క్ నడుపుతున్న నీతూబాయి

Jun 13, 2026 - 21:00
 0  1
నానక్‌రాంగూడలో గంజాయి విక్రయాల నెట్‌వర్క్ నడుపుతున్న నీతూబాయి

హైదరాబాద్‌లో గంజాయి అక్రమ విక్రయాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సంచలనంగా మారింది. నానక్‌రాంగూడలో గంజాయి విక్రయాల నెట్‌వర్క్ నడుపుతున్న నీతూబాయిని పట్టుకునేందుకు దాడులు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల సమాచారం ప్రకారం, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. కిరాణా దుకాణం ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తూ రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా గంజాయి క్వీన్, లేడీ డాన్ నీతూబాయి ఈ దందా నడిపిస్తోంది. అయితే నీతు బాయిని గతంలో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించినా.. మళ్లీ బయటికి వచ్చి గంజాయి దందా చేస్తూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోగా.. తాజాగా మరోసారి తృటిలో చేజారినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల సమాచారం ఆధారంగా ఈగల్ ఫోర్స్ బృందాలు నానక్‌రాంగూడలోని ఓ నివాసంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన 47 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల సందర్భంగా రూ.2.60 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నీతూబాయి గతంలో కూడా పలుమార్లు గంజాయి కేసుల్లో అరెస్టైంది. 2017 నుంచి 2024 మధ్య ఆమెపై దాదాపు 20 కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. 2023లో జరిగిన దర్యాప్తులో ఆమెకు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంపాదనతో కూడిన కోట్ల రూపాయల ఆస్తులను అధికారులు గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లినప్పటికీ, విడుదలైన తర్వాత మళ్లీ గంజాయి విక్రయాలు కొనసాగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు, అనుచరుల సహకారంతో నగరంలోని పలు ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈగల్ ఫోర్స్ రాక సమాచారం ముందుగానే అందడంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో గంజాయి అక్రమ రవాణాపై కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ వరుస ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ స్థాయి గంజాయి సరఫరా ముఠాలను కూడా గుర్తించి భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. తాజా ఘటన తర్వాత నీతూబాయి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆమెను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333