6 నెలల నిరీక్షణకు తెర... మానవపాడు మండలానికి ప్రభుత్వ సర్వేయర్ నియామకం
ప్రజావాణిలో ఫిర్యాదుతో ఫలితం... అధికారులకు సామాజిక కార్యకర్త శాంతకుమార్ కృతజ్ఞతలు
మానవపాడు, 22 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండల ఎమ్మార్వో కార్యాలయంలో గత 6 నెలలుగా ప్రభుత్వ సర్వేయర్ లేకపోవడంతో రైతులు, రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. సర్వే పనులు నిలిచిపోవడం, భూ కొలతల కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో జల్లాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త శాంతకుమార్ గత రెండు నెలలుగా జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
గడిచిన సోమవారం మానవపాడు మండలంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రైతుల తరపున మండల ప్రభుత్వ సర్వేయర్ ను నియమించాలంటూ ప్రజావాణి నోడల్ అధికారి, మండల ఎంపీడీఓ, ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి, నేడు మానవపాడు మండలానికి ప్రభుత్వ సర్వేయర్ ను నియమించారు.
సర్వేయర్ నియామకంతో రైతులు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. తన వినతికి స్పందించి తక్షణమే చర్యలు తీసుకున్న మండల ఎమ్మార్వో మన్సూర్ అలీ సిద్దిక్ ఎంపీడీఓ, రాఘవ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కి అదనపు (రెవెన్యూ), జిల్లా కలెక్టర్ మోహన్ కి సామాజిక కార్యకర్త శాంతకుమార్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మండల ప్రజావాణి వల్ల ప్రయోజనం కలిగిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేస్తుందని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు.