హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంటవద్ద విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది.
ఢీకొన్న తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.