స్కూల్ సమయానికి బస్సులు లేవు: విద్యార్థుల నరక ప్రయాణం!
జోగులాంబ గద్వాల 8 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- శాంతినగర్: పాఠశాల, కళాశాలల వేళల్లో సరైన రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శాంతినగర్ నుండి ఐజ వెళ్లే మార్గంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో విద్యార్థుల ప్రయాణం నరకంగా మారింది.
ఫుట్బోర్డ్ ప్రయాణం.. ప్రాణాల మీదకు ఆశ:-
సమయానికి బస్సులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటంతో విద్యార్థులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. బస్సు డోర్ల వద్ద వేలాడుతూ, కనీసం లోపలికి వెళ్లేందుకు కూడా స్థలం లేని పరిస్థితుల్లో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. చదువుల కోసం ప్రతిరోజూ ఇంతటి ప్రమాదకర ప్రయాణం చేయాల్సి రావడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి:-
ఉదయం పాఠశాలలకు వెళ్లే సమయంలో మరియు సాయంత్రం తిరిగి వచ్చే వేళల్లో శాంతినగర్ - ఐజ మార్గంలో అదనపు బస్సులను నడపాలని విద్యార్థులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.