సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకం.
బడుగు బలహీన వర్గాల హక్కులకై పోరాటం.
జయంతి కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే.
జోగులాంబ గద్వాల 18 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ మంగళవారం ఐడిఓసి ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్న కలెక్టర్, ఇతర అతిధులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న మొగలులను, గోల్కొండ నవాబులను ఎదిరించిన గొప్పవీరుడని కొనియాడారు. సర్దార్ పాపన్న గౌడ్ కేవలం ఒక వీరయోధుడే కాకుండా, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతిని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. పేదల కోసం ఆయన చేసిన త్యాగం, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి నడిపిన ఉద్యమం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఉన్నారు. ఈ సందర్భంగా. గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మొగల్ రాజుల దురాగతాలకు, నిజాం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికోసం తన జీవితాన్ని అర్పించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సమానత్వం, ఆత్మ గౌరవ ప్రతీకగా పాపన్న నిలిచారన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించుకోవడం ప్రతి తరానికి గర్వకారణమనీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ బాషా, జిల్లా అధికారులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, గణపతి రెడ్డి, లింగాచారి, ఇతర అధికారులు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.