మొక్కుబడిగా పౌర హక్కుల దినోత్సవం
సూర్యాపేట రూరల్, 31 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- బలహీనవర్గాల ప్రజలకు, దళితులకు హక్కుల అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పౌరహక్కుల దినోత్సవం ప్రభుత్వ అధికారుల తీరుతో నీరుగారుతుంది. ప్రతి నెల చివరి రోజున మండలంలో ఏదో ఒక గ్రామపంచాయతీ పరిధిలో అన్ని శాఖల అధికారులతో దళిత కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి హక్కులపై అవగాహన కల్పించి దేవాలయ ప్రవేశం చేయించే బృహత్తర కార్యక్రమం అయినప్పటికీ అధికారులు మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. సోమవారం సూర్యాపేట మండల పరిధిలోని రామారం గ్రామంలో అధికారులు ఫోటో కోసమే కార్యక్రమాన్ని నిర్వహించి విమర్శల పాలయ్యారు. ఈవిషయమై పలువురు యువకులు సోషల్ మీడియా వేదికగా అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.