బాధితుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి - జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు గ్రీవెన్స్ డే నిర్వహణ.
జిల్లా నలుమూలల నుండి విచ్చేసి, నేరుగా ఎస్పీకి సమస్యలు తెలియజేసిన ఫిర్యాదుదారులు.
జోగులాంబ గద్వాల 30 మార్చ్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- బాధితుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్., అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీకి, జిల్లా నలుమూలల నుండి సుదూర ప్రాంతాల వారు నేరుగా ఫిర్యాదులను సమర్పించి వారి సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను తెలియజేసిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి ఫిర్యాదుల పట్ల వారి సమస్యల పట్ల వెంటనే సిబ్బందిని కేటాయించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
ఈరోజు వచ్చిన పిర్యాదులలో పొలానికి సంబంధించి - 3, గొడవలకు సంబంధించి - 1, గర్ల్ మిస్సింగ్ సంబంధించి -1, అధిక వడ్డీలకు సంబంధించి - 1, ఇతర విషయాలకు సంబంధించి - 4,
మొత్తం 10 ఫిర్యాదులు అందాయి అని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు.
గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ డి.ఎస్పీ. వై మొగిలయ్య, గద్వాల్ శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టి. శ్రీను, ప్రదీప్, టాటాబాబు తదితరులు పాల్గొన్నారు.