గణిత విజ్ఞాన మేళలో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
“ఉపాధ్యాయునికి – విద్యార్థి బంధం రైతుకు–పంటకు ఉన్న బంధంలాంటిది” – జిల్లా ఎస్పీ
జోగుళాంబ గద్వాల 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల్. జిల్లా లోని గద్వాల్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలలో జిల్లా స్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్–2025 సందర్భంగా ఏర్పాటు చేసిన గణిత విజ్ఞాన మేళ అందరినీ ఆకట్టుకుంది అని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు, ఐపిఎస్., అన్నారు. ఈ మేళలో జడ్పిహెచ్ఎస్ అమరవాయి పాఠశాల విద్యార్థులు పాల్గొని, గణితానికి సంబంధించిన వినూత్న మోడళ్లు, ప్రాజెక్టులతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు రూపొందించిన ప్రతి మోడల్పై ప్రశ్నలు అడిగి వారి అవగాహనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంత చక్కగా ప్రదర్శించడం నిజంగా అభినందనీయం. నేను నా చిన్నతనంలో ఇలాంటి అవకాశాలు పొందలేకపోయానని ఇప్పుడు అనిపిస్తోంది” అని అన్నారు. అలాగే, “టీచర్కు విద్యార్థికి మధ్య ఉన్న బంధం రైతుకు పంటకు ఉన్న బంధంలాంటిదే. ఉపాధ్యాయులు తలుచుకుంటే ఎవరికైనా మంచి భవిష్యత్తు ఇవ్వగలరు” అని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసంపైనా దృష్టి పెట్టి, తల్లిదండ్రులు, గురువులు, ఊరు, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. మీలో చాలామంది భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్–2025లో ప్రతిభ కనబరిచి స్టేట్ లెవెల్కు ఎంపికైన 6 మంది విద్యార్థులు అయిన విజయలక్ష్మి – జడ్పిహెచ్ఎస్, తనగల, బి. సురేంద్ర – జెడ్పిహెచ్ఎస్, భూంపురం, నిక్షిత – గర్ల్స్ హై స్కూల్, గద్వాల్, నవీన్ – జెడ్పిహెచ్ఎస్, రాజోలి, జీవితేష్ – జడ్పిహెచ్ఎస్, రామాపురం, చిన్నికృష్ణ – జడ్పిహెచ్ఎస్ ధరూర్ ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తో పాటు గద్వాల్ టౌన్ ఎస్.ఐ. కళ్యాణ్ కుమార్, గద్వాల్ ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ బాలచంద్రుడు, ప్రభుత్వ బాలుర హై స్కూల్ హెడ్ మాస్టర్ రేణుకాదేవి, టి.ఎమ్.ఎఎఫ్. అధ్యక్షుడు బసవరాజు, టి.ఎమ్.ఎఎఫ్. ప్రధాన కార్యదర్శి అనిత, టి.ఎమ్.ఎఎఫ్. గౌరవ అధ్యక్షులు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లు వరద సుందర్ రెడ్డి-ధర్మవరం, వి. నరేష్ - అమరవాయి, జగదీశ్వర్ రెడ్డి-వెలుగొండ ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.