కస్తూర్బా పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించిన కలెక్టర్.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి - కలెక్టర్ ఆదేశం.
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి - బాలికల విద్యాలయ సిబ్బందికి సూచనలు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.
జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికతో బోధన చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు ఉపాధి మార్గదర్శకత్వం అందించడంతో పాటు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన పట్టిక ప్రకారం విద్యార్థులకు పోషకాహారంతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. వంట, నిల్వ గదులను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. బాలికల విద్యాలయానికి సంబంధించిన హాజరు పట్టికలను పరిశీలించిన కలెక్టర్ తగు సూచనలు చేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పాఠశాలలో జరుగుతున్న మౌలిక వసతుల పనులను కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్, మురుగునీటి సమస్యలను సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ పర్యటనలో తహసీల్దార్ నందిని, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.