అవును మానవీయ విలువలను నేర్పే విద్య ఇప్పటికీ నిర్లక్ష్యంకు గురి కావడం శోచనీయం
ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నైపుణ్యాల లోటు నిరాశాజనక0.* ఈ మార్పoత విద్యార్థి దశలోనే మొగ తొడగాలి..*
--06....02....2025*********
--వడ్డేపల్లి మల్లేశం 9014206412 ***
స్వతంత్ర పోరాట కాలము నుండి నేటి వరకు కొనసాగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలు జాతులపరంగా జరుగుతున్న పోరాటాలు ప్రజల పక్షాన త్యాగాలకు సిద్ధపడి రాజ్య హింసకు గురవుతున్నటువంటి ఉద్యమకారులు ఒక లక్ష్యం కోసం త్యాగం కోసం మానవీయ విలువల పునరుద్ధరణ కోసం తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే నూతన వ్యవస్థ ఆవిష్కరణ కోసం కృషి చేస్తున్న విషయాన్ని మనం అనాదిరా ఈ దేశాన్ని పరిశీలిస్తే కానీ అర్థం కాదు. స్వతంత్ర పోరాటంలో ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు గండి కొట్టిన ఆంగ్ల పాలకులను మట్టుపెట్టే క్రమంలో ఉరి కంభమెక్కిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లాంటివాళ్ళు, న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు స్వతంత్రంగా వ్యవహరించి ఆజాద్ అని పిలిపించుకొని నిర్బంధాలకు బలి అయ్యే సందర్భంలో నీవల్ల అరెస్టు కావడం ఏంటి అని తనకు తానే కాల్చి చంపుకొని దేశమాత ఒడిలో సేద తీరిన చంద్రశేఖర్, సాయుధ పోరాటం మితవాద అతివాద విధానాలలో కొనసాగినటువంటి విప్లవోద్యమం మెజారిటీ ప్రజల యొక్క భాగస్వామ్యంతో సాగిన ప్రజా ఉద్యమం వల్లనే సాధ్యమైనది. ప్రజలు ఉత్పత్తిలో భాగస్వాములు కావడం, రాజ్య పరిరక్షణలో లీనమైపోవడం, హక్కుల కోసం అవసరమైతే రాజ్యం పైన రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడం, ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పైన ప్రశ్నించి ప్రతిఘ టించి నిల దియ్యడం తమ బాధ్యతలుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది.ఈ క్రమంలో మనుషుల మధ్యన మానవీయ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజల మధ్యన మానవీయ సంబంధాలు కొనసాగాలంటే తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగినప్పుడే సాధ్యమవుతుంది. సమన్వయంతో ప్రేమానురాగాలతో ఐక్య ఉద్యమాల ద్వారా ఎంతో సాధించవచ్చు దానికి కావలసింది చరిత్ర సంస్కృతి నాగరికత మానవీయ విలువల చుట్టూ పరిభ్రమించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుతం భారతదేశంలో కొనసాగుతున్నటువంటి విద్యావ్యవస్థలో మానవీయ విలువలకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానానికి డిజిటల్ ఆన్లైన్ అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా మనిషి తన ప్రవర్తనకు వక్ర భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పిదాల నుండి రక్షించుకోవడానికి, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి,స్వార్థ ప్రయోజనాలకు ఎగబాకడానికి..... అందుకే మానవీయ విలువల పరిరక్షణ క్రియాశీలకమైనది అనే భావన పునాదిగా కావలసినటువంటి విద్య అవసరాన్ని నొక్కి చెబుతున్నటువంటి మహానుభావుల గురించి మనం రేఖామాత్రంగానైనా చర్చించుకోవడం చాలా అవసరం .సామాజికవేత్త సందీప్ పాండే ఏమంటున్నాడు:-
**********
"రాజకీయ నాయకులు రాజకీయ ప్రలోభాలకు ప్రయోజనాలకు లబ్ది పొందడానికి అక్రమార్జనకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రజల ఆకాంక్షలకు ఇవ్వరు అందుకే వారి మాటల్లో హామీలు వాగ్దానాలు ప్రలోభాలు ఎక్కువగా నిరంతరం కనపడుతూ ఉంటాయి. అందుకే రాజకీయ నాయకుల యొక్క నినాదాలు అంత పెద్దగా ప్రచారంలోకి రాలేదు కానీ కవులు రచయితలు కళాకారులు మేధావులు సామాజికవేత్తలు శాస్త్రవేత్తల యొక్క వ్యాఖ్యానాలు మనకు నిరంతరం ప్రజల గుండెలను తట్టి లేపుతూ ఉంటాయి. నినాదాలు సూక్తుల రూపంలో పుస్తకాలలో సర్వత్రా దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి మానవీయ కోణాన్ని ఆవిష్కరించినటువంటి ప్రముఖ సామాజికవేత్త భారతీయ సామాజిక విశ్లేషకుడు సందీప్ పాండే హెచ్చరికను సూచనను పరిశీలించడం, ఆమోదించడం,ఆచరించడం, భారతదేశ పాలనకు ప్రజా ప్రయోజనాలకు అన్వయించుకోవడం చాలా అవసరం. "
"ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నటువంటి యువత సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. కారణం ప్రభుత్వమే ఆమోదించి అనుమతించినటువంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడమే కారణం. దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అనేది సందీప్ పాండే వారి యొక్క వాదన. అందుకే ఎక్కువ సంఖ్యలో యువత ఉత్పత్తిలో భాగస్వాములు అయ్యే విధంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని అందుకు సంబంధించినటువంటి నైపుణ్యాలను ప్రధానంగా విద్యార్థి దశలోనే అలవర్చే విధంగా సిలబస్ పాఠ్యాంశాలు ఉపాధ్యాయుల బోధన విద్యా లక్ష్యాలు, ప్రణాళిక ఉండాలని చేసిన సూచన నిత్యం నిరంతరం సమాజం మనగడకు దిశా నిర్దేశం చేస్తూనే ఉంటుంది చేయాలి కూడా" ."సమైక్య ఉద్యమాలను విజయవంతం చేయాలన్న, ప్రజలు ఉమ్మడిగా ఉత్పత్తి ఆధార ఆర్థిక వ్యవస్థకు కలిసి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నా, మానవీయ విలువలతో ప్రజలు జీవించగలిగే మహోన్నతమైన సంస్కృతిని ఆవిష్కరించుకోవలసినటువంటి అవసరం ఉంది. తద్వారా సాటి మనుషుల పట్ల సహానుభూతితో మెలగడం ప్రేమ ఆత్మీయత అనురాగాన్ని వ్యక్తం చేయడం ద్వారా పరస్పర అవసరాలను తీర్చే విధంగా వారి మధ్యన మానవ సంబంధాలను బలోపేతం చేయగలగడం కూడా చాలా అవసరం. అలాంటి విద్య పాఠ్యాంశాలలో అంతర్భాగం కావాలనేది వారి వాదన పాఠ్యాంశాలలో మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసే బాధ్యత కూడా విద్యార్థి దశలోనే సాగాలని చెప్పడం మరొక కీలక అవసరం ఇక్కడ సందీప్ పాండే గారి యొక్క వాదనలో మనకు స్పష్టమవుతున్నది ".
"వ్యవస్థలో రావలసినటువంటి మార్పుకు విద్యార్థి దశలోనే అంకురార్పణ జరగాల్సిన అవసరం ఉంది. ప్రశ్నింప నేర్పడం, హక్కుల కోసం పోరాడడం, బాధ్యతలను కర్తవ్య పూర్వకంగా నిర్వహించడం, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రతిఘటించడం, చట్టసభల్లోను బయట ప్రభుత్వాల వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టే విధంగా ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం ప్రజాస్వామిక దేశాలలో చాలా అవసరం. ఎందుకంటే ప్రజల జాగరూకత ప్రజాస్వామ్యం విజయవంతం కావడంతో తొలిమెట్టు కనక ఇక్కడ విద్యా వ్యవస్థ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే కొఠారి కమిషన్ తన నివేదికలో ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని, నాణ్యమైన ఉచిత విద్య అందించాలని, అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో బడ్జెట్లో నిధులను కేటాయించాలని, అసమానతలు అంతరాలు లేని వ్యవస్థను స్థాపించడం కోసం కుల మతాలకతీతంగా కామన్ స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టాలని చేసిన సూచన అమలుకు నోచుకోకపోవడం నిరాశ జనకమే కాదు భవిష్యత్తు తరాల యొక్క అభివృద్ధికి పెద్ద దెబ్బ. ఇప్పటికైనా దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా ఆలోచించి అంకురార్పణ చేయడానికి పూనుకుంటేనే పాలకులకు భవిష్యత్తు ఉంటుంది అనేది నగ్నసత్యం. ఈ వాదన సందీప్ పాండే గారి వ్యాఖ్యానంలో అణువణువునా అంతర్భాగమై ఉన్నది అనడంలో సందేహం లేదు. విలువల ప్రాతిపదికన విద్యా పాఠ్యాంశాలను అమలు చేయడానికి, ప్రశ్నించే యువతను తయారు చేయడానికి ఉపాధ్యాయులు సమాజము మేధావులు తమ సర్వశక్తులను దార పోసినప్పుడు మాత్రమే సమాజము అంతరాలు అసమానతలు వివక్షతకు గురికాకుండా సమ సమాజం వైపు పరుగులు పెడుతుంది."
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు (చౌటపల్లి) రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )