అకారణంగా దోబి కార్మికురాలి విధుల నుంచి తొలగించడం అన్యాయం
చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి
సూర్యాపేట 09 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- గత 23 సంవత్సరాలుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దోబి వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న దోబి కార్మికురాలు అక్కినపల్లి జానకి ని అకారణంగా విధుల నుంచి తొలగించడంతో ఆమె కుటుంబం రోడ్డున పడిందని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త కొండ శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని ఇందిరా పార్క్ లో విలేకరుల సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సట్టు నాగయ్య తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మిషనరీ దోబి కాంట్రాక్ట్ ఫారుఖ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్, ఆర్ఎం జనార్దన్ లు జానకి పై నోటికి వచ్చినట్లు దుర్భాషాలాడుతూ ఆమెను విధుల నుంచి తొలగించడం అన్యాయం అన్నారు. రోగుల దుస్తులు, ఇతర రక్తపు మరకలు ఉన్న వస్త్రాలను ఉతికే జానకిని, ఎందుకు నన్ను తొలగించారని ఆమె అడగడంతో వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వారు బూతులు తిడుతున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టర్, సూపరింటెండెంట్, ఆర్ఎంలు తమకు రాజకీయ అండ ఉందని తమను ఎవరు ఏం చేయలేరని, ఎవరికి చెప్పకుంటావో చెప్పుకొమ్మని బెదిరింపులకు దిగితున్నారని ఆరోపించారు. తక్షణమే దోబి కార్మికురాలు అక్కినపల్లి జానకి ని విధుల్లోకి తీసుకోవాలని లేదంటే తమ కులస్తులు లక్షల్లో ప్రభుత్వ ఆసుపత్రులను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో దోబి కాంట్రాక్ట్ లను చాకలి కులస్తులకు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ గీత, మర్రిపల్లి స్వప్న, శ్రావణి, మర్రిపల్లి మల్సుర్, శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.