శాంతినగర్ ఎస్ బి ఐ బ్యాంకు సేవలపై ఖాతాదరుల ఆగ్రహం
జోగులాంబ గద్వాల్ 1 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలం శాంతినగర్ ఎస్ బి ఐ బ్యాంకులో ఖాతాదారులకు సకాలంలో సరైన సేవలు అందడం లేదని, ఎటిఎం సేవలు పని చేయడం లేదని వినియోగదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఒక రైతు తన బ్యాంకు ఖాతాపై ఉన్న హోల్డ్ తొలగించాలని సంబంధిత శాఖను ఆశ్రయించగా, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ సమస్యను పరిష్కరించకుండా "వేచి ఉండండి, లేకపోతే వెళ్లిపోండి" అనే విధంగా స్పందించారని ఆయన వాపోయారు. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఖాతాదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు, కొందరి పనులు మాత్రం త్వరితగతిన పూర్తి అవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఖాతాదారునికి సమానమైన గౌరవం, వివక్ష లేకుండా సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి, ఖాతాదారులకు పారదర్శకమైన, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందేలా తగిన చర్యలు చేపట్టాలని వడ్డేపల్లి మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.