విద్యుత్ వైరు తగిలి పాలిచ్చే బర్రె మృతి.. రైతు ఆవేదన
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు పాండ్య నాయక్ తండలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన వైరు తగిలి ఓ పాలిచ్చే బర్రె మృతి చెందింది. ఈ ఘటనతో బాధిత రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండ్య నాయక్ తండకు చెందిన ధరవత్ బిక్షంకు చెందిన పాలిచ్చే బర్రె ప్రతిరోజులాగే మేత కోసం సమీపంలోని అడవికి వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో తండకు ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే రైతుకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ధరవత్ బిక్షం తన జీవనాధారమైన పాలిచ్చే బర్రె మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురై బోరున విలపించాడు. బర్రె మృతి కారణంగా తనకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తండ పరిసరాల్లో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. బాధిత రైతుకు తక్షణమే నష్టపరిహారం అందించడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను మరమ్మతులు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.