100 పడకల ఆసుపత్రినీ అందుబాటులోకి తీసుకురావాలి

జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చిన బీఎస్పీ నాయకులు.
జోగులాంబ గద్వాల 10 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: రూ. 21కోట్లు వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిలో నేటికీ వైద్య సిబ్బంది లేకపోవడం అలంపూర్ నియోజకవర్గ ప్రజల దురదృష్టమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు అన్నారు. ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని మార్కెట్ యార్డులో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సోమవారం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ కు వినతిపత్రం సమర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆసుపత్రిని ప్రారంభించి 15 నెలలు గడిచిన నేటికీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది లేదని అన్నారు. మూడు రాష్ట్రలకు కూడలిగా ఉన్న అలంపూర్ చౌరస్తాలో ఆసుపత్రి ఉందని.. అత్యవసర సమయంలో ప్రజలు ఆసుపత్రికి వస్తే పరిస్థితి ఏమిటని అన్నారు. కనీస వసతులు లేవని దాటవేయడం మంచిది కాదన్నారు. అన్ని సౌకర్యాలు వచ్చిన తరువాతనే సిబ్బందిని నియమించడం జరుగుతుందని కాలయాపన చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు.ఆసుపత్రి అయితే తమకు బాగుంటుందని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూపులకు నిరాశే ఎదురైందని అన్నారు.స్థానిక ప్రజాప్రదినిధులు కూడా పట్టించుకోవడం లేదంటే వారికి నియోజకవర్గ ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమవుతుందని అన్నారు. 100పడుకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చి, సిబ్బందిని కూడా నియమించే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవలని డిమాండ్ చేశారు.జిల్లా స్థాయి ఉన్నత అధికారులు కూడా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకొవలని అన్నారు.లేదంటే రూ. 21కోట్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా ప్రజలపై భారం పడుతుందని అన్నారు.వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా ఉపాధ్యక్షుడు మణి కుమార్, అలంపూర్ అసెంబ్లీ అధ్యక్షులు శశి వర్మ తేజ, ధరూర్ మండల ప్రధాన కార్యదర్శి దేవన్న, రాఘవేందర్ ఇతరులు ఉన్నారు.