యూరియాను కొరతను తీర్చాలి

.... వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావుకు రైతుల బాధలు విన్నవించిన ఎమ్మెల్యే విజయుడు.
జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ అన్నదాతలకు యూరియా కష్టాలు లేకుండా చూడాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు.రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావును బుధవారం నాడు హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో కలిసి మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంతో పాటు, జిల్లాలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం అన్ని పనులు వదిలేసి క్యూలో నిలబడాల్సి వస్తుందని,అయినప్పటికీ యూరియా అందడం లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు సరిపడంతా యూరియాను ఆయా కేంద్రాల వారిగా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే పలుచోట్ల ఆయా పంటలు దెబ్బతింటున్నాయని, యూరియా కూడా సరైన సమయానికి అందకపోతే అన్నదాతల ఆవేదన మరింతగా పెరుగుతుందని వారి బాధను అర్థం చేసుకొని యూరియా కొరత లేకుండా చూడాలని ఆయన విన్నవించారు.ఎమ్మెల్యే తో పాటుగా బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.