జిల్లాలో రైతులకు యూరియా ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుంది
ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించవద్దు
------ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్.
జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా గద్వాల టౌన్ లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఎస్పీ సహకార సంఘం దగ్గర రైతులకు యూరియ కోసం ఇస్తున్న టోకెన్స్ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఎరువులు సమయానికి అందేలా చూడాలని అక్కడి అధికారులకు స్పష్టం చేశారు. గోదాంలలో నిల్వ ఉంచిన ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియాను సకాలంలో అందించాలన్నారు. రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పూర్తిస్థాయిలో యూరియా అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నారు. అన్ని మండలాలకు యూరియా నిలువలు వచ్చేలా ప్రభుత్వం, అధికారయంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై .మొగిలయ్య , గద్వాల్ టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎమ్.ఏ. సుభాన్ తదితరులు పాల్గొన్నారు.