దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంది ..? ఎమ్మెల్యే సామెల్

Jul 24, 2026 - 20:51
 0  5
దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏంది ..? ఎమ్మెల్యే సామెల్

  దళిత నియోజకవర్గాల పై మీ పెత్తనం చెల్లదు... ఖబర్దార్! 

మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటు

 తుంగతుర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు

 ముందు నీ మునుగోడు మురికిని చూసుకో 

 నా హక్కులను హరిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా

 నా డప్పు మోగుద్ది.. నా చిర్ర మోగుద్ది.. నా పని కత్తులు లేస్తాయి ఖబర్దార్

 ఎస్టిలకు యాదవులకు మంత్రి పదవులు ఇవ్వాలి 

 బడుగు వర్గాలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక

 టీపీసీసీ నియమించిన మండల అధ్యక్షులే కొనసాగుతారు

 

తుంగతుర్తి,(తిరుమలగిరి 25  జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

దళిత నియోజకవర్గం మీ పెత్తనం ఖబర్దార్ అని కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎమ్మెల్యే సామెల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలపై వ్యాఖ్యానించే నైతిక హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.

తుంగతుర్తి నియోజకవర్గం గురించి గాంధీభవన్‌లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మండిపడ్డారు. "మునుగోడు ఎమ్మెల్యేకు నా నియోజకవర్గంతో ఏం సంబంధం ఉంది? ముందు నీ మునుగోడు సమస్యలు, నీ .. మునుగోడు మురికిని చూసుకో. బీజేపీ నుంచి వచ్చిన నీతో పాటు వచ్చిన నాయకులకే మండల పార్టీ అధ్యక్ష పదవులు ఇప్పించలేకపోయావన్నారు.కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు" అంటూ ఘాటుగా స్పందించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపించిన ఎమ్మెల్యే సామేలు, దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాననీ హెచ్చరించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఎన్నిసార్లు విన్నవించినా మంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తన నియోజకవర్గంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

దళిత నియోజకవర్గాలపై పెత్తనం చెలాయించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తూ, "మా మాదిగ నియోజకవర్గాల జోలికి వస్తే సహించనన్నారు. రాజ్యాంగం ప్రకారం నాకు టికెట్ వచ్చింది. నేను ఎవరి దయాదాక్షిణ్యాలపై రాజకీయాల్లోకి రాలేదు" అని స్పష్టం చేశారు.

నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ అని, ఇక్కడ శ్రమజీవులే ఉంటారని పేర్కొంటూ, "నేను భయపడేది తుంగతుర్తి ప్రజలకు, ఓటర్లకు మాత్రమే. నాకు ఎవరిముందూ చేతులు చాచే అవసరం లేదు" అని వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో వేముల వీరేశానికి 67 వేల మెజార్టీ ఇచ్చిన ప్రజలు, తనకు తుంగతుర్తిలో 50 వేల మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీని బడుగు, బలహీన వర్గాల ప్రజలే నిలబెడుతున్నారని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు పార్టీని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు.

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులే కొనసాగుతారని స్పష్టం చేశారు. వారి నియామకాలపై ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే సామేలు, ప్రస్తుతం ఉన్న రెండు మంత్రి పదవుల్లో ఒకటి ఎస్టీ వర్గానికి, మరొకటి యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే తన హక్కులను హరించే ప్రయత్నాలు కొనసాగితే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేలు హెచ్చరించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 32 కోట్లతో బిక్కీరు వాగు పై ఆరు చెక్ డ్యాంలను పూర్తిచేస్తే నేడు సుమారు 12 వేల ఎకరాల సాగు భూమి సస్యశ్యామలం అయ్యిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 170 కోట్లతో సీసీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. 30 గ్రామాలకు నూతన గ్రామపంచాయతీ బిల్డింగులను నిర్మించినట్లు తెలిపారు. సుమారు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల, తిరుమలగిరి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, 16 కోట్లతో తుంగతుర్తి మెయిన్ రోడ్డు మంజూరు చేయించినట్లు తెలిపారు. తిమ్మాపురం నుండి వెంకేపల్లి గ్రామం వరకు 18 కోట్లతో డబల్ రోడ్లు వేయించినట్లు తెలిపారు. అదేవిధంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భుదాని గాని కాలువ ను మంజూరు చేయించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు సుంకరీ జనార్ధన్ తో పాటు 8 మండలాల అధ్యక్షులు, పిఎసిహెచ్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి