వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం తీపి కబురు
న్యూఢిల్లీ:-వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వంటగ్యాస్ బుకింగ్ గడువును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్ గడువును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి సురేశ్ గోపీ సోమవారం వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎల్పీజీ సరఫరాపై పడిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని గతంలో దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఆ మార్పుల ప్రకారం రీఫిల్ బుకింగ్ మధ్య గడువు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో పాటు రీఫిల్ పెండింగ్ బాకీలు (బ్యాక్లాగ్) కూడా గణియంగా తగ్గడంతో ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా 25 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
తక్షణమే అమల్లోకి:
అయితే దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో తీసుకువచ్చిన ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL)కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరటగా మారనుంది.