జన జీవన స్రవంతిలోకి పోతుల పద్మావతి

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పనా జ్యోతి, అలియాస్ సుజాత ప్రభుత్వం ముందు లొంగిపోయారు.
జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గట్టు మండలం, పెంచికలపాడు గ్రామానికి చెందిన పోతుల పద్మావతి తండ్రి మృతి చెందగా తల్లి, ముగ్గురు సోదరులు ఒక సోదరి ఉన్నారు.
ఈమే పదో తరగతి వరకు ఐజలో, ఇంటర్మీడియట్ గద్వాలలో చదివారు. మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుండగా రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితురాలై చివరకు అడవి బాట పట్టారు. తన 43 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఒక్కసారి మాత్రమే పెంచికలపాడు గ్రామానికి వచ్చిన ఆమె మరెప్పుడు కూడా కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులను కానీ కలవలేదు. అనేకసార్లు తృటిలో ఎన్కౌంటర్ నుంచి ఆమె తప్పించుకున్నారు. ఏదో ఒక రోజు ఎన్కౌంటర్ కు గురవుతుందని భావిస్తున్న తరుణంలో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసారు. ఈ వార్తతో కుటుంబం మరియు గ్రామం ఆనందమయం అయింది.