ఇసుక ట్రాక్టర్ ..ఢీ ..వ్యక్తి మృతి
అర్వపల్లి 02 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
అతి వేగంతో, నిర్లక్ష్యంగా ఇసుక ట్రాక్టర్ నడిపి బైక్ ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో స్పాట్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి లో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. అర్వపల్లి గ్రామానికి చెందిన గద్దగూటి మల్లయ్య (45) తన సోదరుని కుమారుడి పుట్టినరోజు వేడుకలకు ఇంటి నుంచి సూర్యాపేట వైపు ఫంక్షన్ హాల్ కు వెళ్తుండగా, అదే సమయంలో అతి వేగంతో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొని మృతుని పైనుంచి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. కొద్ది సేపటి క్రితం వరకు తమతో కలిసి తిరిగిన వ్యక్తి మృతిచెందాడనే విషయాన్ని తెలుసుకున్న బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అనంతరం బంధువులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో జనగాం-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగారం సీఐ నాగేశ్వరరావు మృతుని బంధువులతో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. మృతుని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. మృతుడు ఫణిగిరి విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు..దీంతో వారి స్వగ్రామంలో విషాదఛాయల అలుముకున్నాయి