చదువుకున్న వారిలో కూడా  వ్యసనాల పట్ల అవగాహన లేకపోవడం,నిర్లక్యం  సమస్యల ఉధృతికి మరింత కారణం

May 28, 2026 - 16:40
 0  0

.* పొగతాగడం వల్లభారత్ లో ఏటా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుంటే పాలకులు, ప్రజలకు  భయం లేదంటే ఏమందాం.?* 
  ----ప్రజారోగ్య నిపుణులు ప్రబాత్ ఝా   ఆందోళన .
**************
----వడ్డేపల్లి  మల్లేశం 
   ఒక్క రాష్ట్రానికి పరిమితం కానటువంటి దేశవ్యాప్తంగా  కోట్లాది ప్రజానీకాన్ని కలవరపరుస్తు, జీవితంలో భాగమై,  అలవాటులో అగ్రస్థానంలో ఉన్న  ధూమపానం   వల్ల జరిగే ఇబ్బందులు  పరిణామాలు  అంతా ఇంతా కాదు . భయంకరమైన  పరిణామాలకు దారి తీసే దుశ్చర్య,  దురలవాటు  అని తెలిసి కూడా మౌనం వహించడంలోని ఆంతర్యం ఏమిటి?  భారత్ ప్రముఖ ప్రజారోగ్య నిపుణులు  ప్రభాస్ ఝా ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ  అక్షరాస్యత భారీగా ఉన్నదని గర్వంగా చెప్పుకునే భారతదేశంలో  విద్యావంతులై ఉండి కూడా  పొగతాగడం వల్ల వచ్చే పరిణామాలను అర్థం చేసుకోకపోవడం, మౌనంగా ఉండడం,  బాధ్యతారాహిత్యం కాదా?  ఇది కేవలం పొగ తాగే వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం కాదు  ఎదురుగా ఉన్న వాళ్లకు,  ఇరుగు పొరుగు వాళ్లకు,  చివరికి వాతావరణం కూడా కల్మషం కావడానికి  దారితీస్తున్న నేపథ్యంలో  ఈ వికృత పరిణామాన్ని అర్థం చేసుకోకుండా  సమాజం యావత్తు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే  రాబోయే తరం   ఎంత బలహీనంగా ఉంటుందో  ఊహిస్తేనే  ఆందోళన కలగక మానదు.  ఈ అలవాటును దురలవాటని,  హాని చేస్తుందని,  మొగ్గలోనే తుంచి వేయాలని,  విపరీత పరిణామాలకు దారి తీయడం ద్వారా అనారోగ్య భారతదేశము ఆవిష్కృతం అవుతుందని, ఇది  ఎంత మాత్రం కూడా సహించడానికి వీల్లేదని  ఆలోచించే వాళ్ళు లేకపోవడం సిగ్గుచేటు.  టీవీ ప్రసారాలలో " తెర మీద పొగ తాగే దృశ్యాన్ని భారీగా ప్రదర్శిస్తూనే  పక్కన పొగ తాగడం హానికరం  ఆరోగ్యానికి" అని నమ్మ పలికే ప్రయత్నంలో ఏక వాక్యాన్ని  చూపించడం అంటే  మేము చెప్పేది చెబుతూ ఉంటాం మీరు చేసేది చేయండి  అన్న చ o దమే కదా!. ప్రజా ఆరోగ్య0లో  "ఈ దురలవాటుకు సంబంధించినటువంటి పరిణామాలు, పర్యవసానాలు,బలహీనతలు, అవకాశవాదం, వాణిజ్య ధోరణి,  లాభా పేక్ష, ప్రభుత్వ అసమర్థత  చర్చించుకోవడానికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు.  నిరాక్షరాశ్యులు,  సమాజంతో సంబంధం లేకుండా సుదూరంలో నివసిస్తున్న ఆదివాసీలు,  ఆర్థికంగా సామాజికంగా వెను కబడిన అనేక మంది  ఈ విషయం పట్ల  రేఖామాత్రంగానై నా ఊహించగలరు. పరిణామాలను ఆలోచించగలరు,  ప్రమాదాలను పసిగట్టగలరు.  కానీ తెలిసి కూడా  మోసపోవడం,  అనారోగ్యమని హాయిగా అనుభవించడం,  క్యాన్సర్ బారిన పడతామని  ఊహకు అందినప్పటికీ  తాత్కాలికంగా  ఆనందంలో మునిగి తేలడం,  పొగ తాగుతూ పీల్చుతూ పొగను రింగులు రింగులుగా వదలి  ఆనందాన్ని మరింతగా రెట్టింపు చేసుకోవడం  ఇది నిజంగా క్షణికావేశంలో చేస్తున్న పని అంతేకాదు  ఇది ఒక  డిగ్నిటీ అని  బాధలు మరిచిపోవడం కోసం  అంటూ  ఈ విలాసాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు."  నిజంగా ఈ విషయంలో  మానవ వికృత ఆలోచనను  ఎంతగా నిరసిస్తే అంత మంచిది.  నిజంగా ప్రమాదాలను   అనారోగ్య భారతాన్ని అంచనా వేసినట్లయితే  ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ లో క్యాన్సర్ మహమ్మారి ప్రథమ స్థానంలో ఉన్నదని  ఉచ్చరించడానికి  ఆందోళన కలుగుతున్నది .
         దురలవాట్లు,  ఫ్రై చేసిన ఆహార పదార్థాలు,  తిరిగి తిరిగి వాడినటువంటి కాల్చిన నూనె  ఏ రకంగానైతే క్యాన్సర్ తో పాటు పలు అనారోగ్యాలకు కారణమవుతున్నాయో  ఒక్క ధూమపానంతోనే అన్ని రకాల క్యాన్సర్లు కూడా  విశ్వవ్యాప్తం కావడానికి  మూలమవుతున్నదని గుర్తిస్తే మంచిది.  "వైద్యరంగంలో  ఆహార అలవాట్లు,  ఆహార పదార్థాల యొక్క  లక్షణాలు,  అనారోగ్యం పై వాటి ప్రభావం,  తక్షణ నిర్మూలన  దీర్ఘకాలికంగా  అదుపు ఎలా చేయాలి?  రోగ లక్షణాలు పరిష్కారాలు  సంబంధిత  మందులు ముఖ్యమైనటువంటి అంశాలపై  పరిశోధన చేసి  ఆయా రంగాల వారీగా  ఉన్నటువంటి ప్రమాదాలు పరిణామాలు పరిష్కారాలు పర్యవసానాలను శాస్త్రీయంగా  అందించే విభాగం  ఏపీ డెమియాలజీలో  పనిచేస్తున్నటువంటి ప్రభాత్ ఝా  తన సుదీర్ఘ పరిశోధనలో భాగంగా  ధూమపానం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందిని  పరిణామాలను పరిష్కారాలను  కారణాలను నిర్లక్ష్యాన్ని  సమాజానికి తెలియజేసే  క్రమంలో హెచ్చరించిన ఈ సూక్తి  మత్తులో ఊగు తున్నటువంటి యువత అన్ని వర్గాల వారికి అంతకుమించి బాధ్యత రాహిత్యంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలకు  కనువిప్పు కావాల్సిన అవసరం  ఉన్నది."  ప్రతి సంవత్సరం పొగ తాగడం వలన భారతదేశంలో  10 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని  లక్షలాదిమంది అనారోగ్యం బారిన పడి  జీవిత కాలాన్ని తగ్గించుకుంటూ  తమకు తామే శిక్ష వేసుకుంటూ  దయనీయ పరిస్థితులలో బతుకుతున్నారని  ఆందోళన వ్యక్తం చేసిన ఈ ఎపిడిమియాలజిస్ట్  ప్రభాత్ ఝా  చదువుకున్న వాళ్లు కూడా ఈ దుష్ట పరిణామాలను గుర్తించకుండా  బాధ్యతారహితంగా వ్యవహరించడం ద్వారా  భారతదేశంలో ఆరోగ్యాన్ని  సవాల్ చేస్తున్నారని  ఇది కోట్లాదిమందికి సంబంధించి  లక్షలాది కుటుంబాలు వీధిన పడడానికి  దోహదం చేస్తుంటే మౌనంగా ఉండడం లోని ఆంతర్యం ఏమిటని?  ప్రజలను  మేధావులతో పాటు ప్రభుత్వాలను కూడా ప్రశ్నించిన తీరు  ఈ హెచ్చరిక లేదా సూక్తి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు.
    ప్రజలతో పాటు బాధ్యత మరిస్తున్న ప్రభుత్వాలు  :*
***********
సామాజిక చైతన్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలలో భాగంగా విద్యా  వ్యాప్తి సమున్నతమైనది.  అక్షరాస్యుల  చేయడం ద్వారా సమాజాన్ని పరిశీలించడం,  ప్రమాదాలను అంచనా వేయడం, పరిష్కారాలను కనుగొనడం,  విశ్లేషకులు నిపుణుల యొక్క సలహాలను పాటించడం,  రాబోయే ప్రమాదాల నుండి  జాగ్రత్త పడడానికి  చర్యలు తీసుకోవడం ప్రధానమైన  ఈ లక్షణాలు  ఇటీవల కాలంలో ప్రజల్లో ఏమాత్రం కూడా కనిపించడం లేదు.  "జల్సాలు ఆడంబరాలు,  డ్రగ్స్  మద్యం మత్తులో ఊరేగడానికి  అన్నింటికీ తోడు పొగ తాగుతూ  హుందాగా హోదాను ప్రదర్శించడానికి అలవాటు పడిన మానవాళి  వికృత చేష్టలను  ప్రభుత్వమే ప్రోత్సహించినట్లుగా అనేక ఆధారాలు మనకు కనబడుతున్నాయి.  సామాజిక బాధ్యతతో వ్యవహరించి, ప్రజలను కంటిపాపలుగా చూసుకొని, వాళ్ళ ఆరోగ్యాన్ని భద్రపరిచి, రక్షణను కల్పించి, ఆర్థిక స్వావలంబన సాధించి  కుటుంబాలను బలోపేతం చేయవలసిన ప్రభుత్వాలు  ఆదాయం సంపద ఆకర్షణ  ఆధిపత్యం పేరుతో అన్నింటిని కూడా గాలికి వదిలి ప్రైవేట్ పరం చేసి  పెట్టుబడిదారులు సొమ్ము చేసుకుంటే మౌనంగా ఉండడం ప్రభుత్వాల వంతు  కావడమే విచారకరం".  పొగతాగడం హానికరం అని  సిగరెట్లు బీడీలు  హుక్కా ఇతర  ధూమపానానికి సంబంధించిన అన్నింటి మీద రాసి  ప్రమాద గంటికలను చిత్రంలో చూపించి   పొగ తాగుతే ఈ రకంగా అయితారనే హెచ్చరికలను కూడా   చిత్రీకరిస్తున్నప్పటికీ ప్రజల్లో భయం లేదు.  పాలకులకు బాధ్యత లేదు.  మాట వరసకు మేము ప్రమాదాలను దానిమీద ముద్రించినాము కదా అని చెప్పుకుంటే సరిపోతుందా.  కళ్ళు లేని  గుడ్డి వాళ్ళ లాగా  మత్తులో ఊరేగాలనుకునే  యువతకు  ఇతర వర్గాలకు  విపరీత పరిణామాలకు సంబంధించిన బొమ్మ కనబడుతుందా?  కనపడిన చూద్దాంలే  నాకు మాత్రమే క్యాన్సర్ వస్తుందా? ఇంకా నా తోటి వాళ్లు తాగడం లేదా?  నష్టం జరిగేది ఉంటే ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తాయి?  పూర్వకాలం నుండి మా తాతలు తండ్రులు తాగలేదా?  పొగ తాగి గౌరవంగా బతినోళ్లు ఎందరో ఉన్నారు కదా! అని మత్తు మాటలతో వెకిలి చేష్టలతో  బాధ్యత మరిచిన యువతను మనం  కళా రా చూస్తూ మౌనంగా ఉంటున్నాం. మన పిల్లలను సమాజంలోని వ్యక్తులను అదుపు చేయలేక  చేష్టలుడిగి  పరిస్థితుల్లో  అటు పోలీసులు వ్యవస్థ పట్టించుకోదు. తల్లిదండ్రులు అచే తనులై   ప్రభుత్వాలు మాకేమిటిలే అనుకుంటూ ఊరుకున్న సందర్భంలో  వాళ్ల భార్య పిల్లలు కుటుంబ సభ్యులు మాత్రం  శిక్ష అనుభవిస్తు కుటుంబ పెద్దదిక్కు లేని అనాధలుగా మిగిలిపోతున్నారు.   బతికినటువంటి వాళ్ళు కూడా అనేక  జబ్బుల పాలై  నిరసించి పోవడo కోసమేనా?  స్వతంత్ర భారతాన్ని సాధించుకున్నది.  సమ సమాజం, ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం, లౌకిక రాజ్యం అని గొప్పగా రాజ్యాంగంలో  చెప్పుకున్నది.
     ఒక్కసారి ఆలోచన చేద్దాం
********
  శాస్త్రీయ ఆధారాలు  ఫలితాలు నివేదికల రూపంలో  ప్రస్ఫుటమై  భయంకరమైన చేదువా వాస్తవాలను  అందిస్తున్నప్పటికీ  రవ్వంత కూడా మనలో చలనం లేదంటే  తల్లిదండ్రులు, యువత, ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు,  సరఫరా సంస్థలు  ప్రోత్సహించేవాళ్లు అంతా కూడా  బాధ్యత మరిచిపోవడమే!  ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల  నిషేధించి  అకృత్యాలకు పాల్పడిన వారిని  శిక్షించి  అక్రమంగా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేకమైన చట్టాన్ని  తేవాలనే ఆలోచన  80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులకు రాకపోవడం ప్రజలు కోరుకోకపోవడం నిజంగా సిగ్గుచేటు.  ఇప్పటికైనా మన మౌనాన్ని వీడి,  బాధ్యతను గుర్తించి,  లోపాలను అంచనా వేసుకొని  పాలకులను ప్రశ్నించుదాం.  అంతిమంగా ఉత్పత్తి   పంపిణీ సంస్థలను  కఠినంగా శిక్షించాలని పోరుబాట పడదాం.  ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించడం కూడా నేరమే అయితే ఈ దేశంలో  అంతకుమించిన దుర్మార్గం మరొకటి ఉండదు. " ఈ ధూమపాన వ్యవస్థను ప్రభుత్వమే బాధ్యతాయుతంగా నిషేధించవలసి ఉండే కానీ  బాధ్యత మరిచినందున ప్రజలే  పోరాటానికి సిద్ధం కావాల్సిన  దుస్థితి ఏర్పడింది.  ప్రభాత్ ఝా  హెచ్చరికతో అయినా  ధూమపానాన్ని  మట్టు పెట్టడానికి పూనుకుందాం".
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333