గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం
4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు
వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు
శివాపూర్, గోగుపల్లిలో కోటి 35 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లు ప్రారంభం
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిసరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు, 27 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిసరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఆర్ఆర్ ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.