కంది కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి

జోగులాంబ గద్వాల 20 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల.:-జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన కంది పంటను కొనుగోలు చేసేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో కందుల కొనుగోలుపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024-25 వానకాలం సీజన్లో రైతులు పండించిన కందులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలోని ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ, పుటాన్ దొడ్డి, గద్వాల మార్కెట్లలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ముందుగా బుధవారం రోజున అలంపూర్, వడ్డేపల్లి మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కందులను కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 7,550/- చొప్పున కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు నాణ్యమైన కందులను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, మార్క్ ఫెడ్ డిఎం గౌరీ నగేష్, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, ఎస్ డబ్ల్యూ సి మేనేజర్ ఉపేందర్ వివిధ శాఖల సహాయ అధికారులు పాల్గొన్నారు.