విషతుల్యమవుతున్న తాగునీరు  చోద్యం చూస్తున్న కేంద్ర రాష్ట్ర సర్కారులు

Apr 6, 2026 - 07:41
 0  2

గణాంకాలు కలుషిత నీటి  దుస్థితికి అద్దం పడుతుంటే  కాలుష్యాన్ని అరికట్టలేక,  

మంచినీటి కల్తీని నివారించకపోతే  భావితరాల బతుకులు బండ భారీ పోవాల్సిందేనా? 

---వడ్డేపల్లి మల్లేశం

ఐదారు దశాబ్దాల క్రితం పురాతన కాలంలో  అతికొద్ది గ్రామాలకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా ఉంటే ఇక చాలా గ్రామాలకు  చెరువులు వాగులు, బావుల ద్వారా  నీటి వసతి కల్పించబడేది. కొన్ని పట్టణాలలో  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ రోజుల్లోనే నీటి సౌకర్యం కల్పించబడినప్పటికీ ఆ పైపులైన్లు క్రమంగా నాశనం అయిపోయి కాలుష్యమై  డ్రైనేజీ నీరు మంచినీటి  పైపుల్లో చేరడం వలన ఇటీవల కాలంలో  తాగునీటి కాలుష్యం నిత్య కృత్యమైపోతున్నది.  ప్రధానంగా వీ టిని నిర్వహించే గ్రామపంచాయతీలు పురపాలక  నగరపాలక సంస్థలు కార్పొరేషన్లు  వీటి పైన దృష్టి సారించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపవలసిన అవసరం చాలా ఉంది.ప్రత్యేక యంత్రాంగం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది  ఏ మార్గాలలో పైపులు చెడిపోయినవి పురాతన స్థితికి చేరుకున్నాయ? మార్చవలసిన అవసరం ఉందా? ఎక్కడెక్కడ కలుషిత మౌతున్నాయి?

కచ్చితంగా కారణాలను అన్వేషించే ప్రత్యేక టీం  పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది.  గమ్మత్తు ఏమిటంటే అన్ని దశాబ్దాల క్రితం కూడా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడి నీళ్లు తాగినా కూడా రక్షణగా ఉండేది.  వాగులు సెలయేర్లలో ఊటలు, తోడుకొని తాగిన అంతా ఆనందంగా తృప్తిగా ఆరోగ్యంగా ఉండేది.  కానీ క్రమక్రమంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి అనేక రక్షిత మందులను వాడుతున్నప్పటికీ కూడా  రోజురోజుకు క్రమంగా మంచినీరు కాలుష్యం కావడంతో పాటు అనేక మంది మృత్యు బారిన పడడాన్ని గమనిస్తే మనం ఎంత వెనుకబడిపోయామో  అర్థమవుతుంది.  రక్షిత,  ఆరోగ్యకరమైన,  ప్రజల భద్రతకు భరోసానివ్వగలిగిన మంచినీటిని కూడా సరఫరా చేయలేనటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో ఉంటే  ఇక ప్రజలకు భద్రత ఏముంది? ఏం గ్యారెంటీ అమలు చేసినట్లు? పోషకాహారం మంచినీటి అంశాలను పక్కన పెడితే ఇక పాలకులకు  ప్రజలను ఉచితాలతో మభ్యపెట్టడం తప్ప ఏ మార్గం లేకుండా పోయింది.  ఉచితాలు కాదు...... మంచినీరు, ఆహారం, గృహ నిర్మాణం, భూమి పంపిణి ప్రధాన బాధ్యతలుగా పాలకులు తీసుకున్నప్పుడే నిజమైన సేవ చేసినట్టు ఉంటుంది. లేకుంటే అది మొక్కుబడి పాలనే.

రాజ్యాంగంలోని 21వ  అధికరణం జీవించే హక్కును మనకు కల్పించింది. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకర వాతావరణము,  రక్షిత పరిశుభ్రమైన తాగునీటి సరఫరా కూడా జీవించే హక్కులోని అంతర్భాగాలని  ఇటీవల కాలంలో  సుప్రీంకోర్టు  వ్యాఖ్యానించినట్లు తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా స్వచ్ఛమైన నీటిని పొందడాన్ని పౌరుల ప్రాథమిక హక్కు  గా గుర్తించిన రాజ్యాన్ని సుప్రీంకోర్టు  ఈ హక్కులు రక్షించవలసిన బాధ్యత కూడా భారత ప్రభుత్వాని దేనిని  గతంలో హెచ్చరించిన తీరు  మంచినీటి సరఫరా విషయంలో పాలకులకు గల బాధ్యతను తెలియజేస్తున్నది. ప్రాథమిక హక్కుగా గుర్తించినది లేదు, జీవించే హక్కులో అంతర్భాగమని అంగీకరించినది లేకపోగా  ఇటీవలి కాలంలో దేశంలో అనేకచోట్ల తాగునీరు కలుషితమై  వందలాది ప్రాణులు గాలిలో కలిసిపోతుంటే  ప్రపంచంలో మనం మూడవ ఆర్థిక వ్యవస్థని గొప్పగా చెప్పుకుంటే  సమాధానం దొరుకుతుందా? 2025 చివరిలో  మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్లో తాగునీరు కలుషితమై  ఎందరో మృత్యువాత పడిన విషయం పతాకశీర్సికన రాలేదా?  అంతేకాదు బెంగుళూరు, గాంధీనగర్, గ్రేటర్ నోయిడాలతో పాటు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఆళ్లగడ్డ వంటి చోట్ల కూడా  తాగునీరు కలుషితమై గతంలో అనేక కేసులు నమోదైన విషయం మనందరికీ తెలుసు. అనేక సందర్భాలలో హైదరాబాదులో మంచినీటి పైపులైన్లు మురుగు కాలువల మధ్య నుండి వెళుతున్నట్లు  తాగునీరు మురికి కూపంగా మారినట్లు  ప్రకటనలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు సుమా!అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడమేనా పాలనoటే.

 కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం 

485 పట్టణాలలో కేంద్ర ప్రభుత్వం జరిపిన ఒక సర్వేలో 46 చోట్ల మాత్రమే  శుద్ధ జలాలు అందుతున్నట్లు తేలింది అంటే స్థానిక సంస్థలు మున్సిపల్ కార్యాలయాలు యొక్క బాధ్యత  ఎంత  అనాగరికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇక దేశవ్యాప్తంగా గృహాలకు సరఫరా అవుతున్న నల్లాల ద్వారా వచ్చే నీటిని పరిశీలిస్తే 24% నమూనాలు  ఆరోగ్య ప్రమాణాల మేరకు లేవని  ప్రభుత్వ వర్గాలే తెలియజేస్తున్నాయి.  అపరిశుభ్రమైన టువంటి నీళ్లను ప్రజలు తాగుతున్న కారణంగా  సంక్రమిస్తున్న వ్యాధుల మూలంగా భారతదేశంలో ప్రతి ఏటా 3న్నర కోట్ల మంది మంచం మంచం బారినపడి  అనారోగ్యం పాలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నట్టు  తెలుస్తున్నది.  ప్రభుత్వాలు నీటి సరఫరాకు శుద్ధ జలాలను అందించడానికి ఇతరత్రా సౌకర్యాలు కల్పించడానికి ఖర్చుకు భయపడి పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చలగా టమాడుతుంటాయి కానీ  ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో  తెలిపిన విధానాన్ని పరిశీలిస్తే  ప్రతి ఇంటికి శు ద్ధమైన మంచినీటిని కనుక అందించగలిగితే  మలినాలను మధ్యలో జోడించకుండా నివారించగలిగితే  4 లక్షల మంది అర్ధా o తర మరణాల  ఆప వచ్చునని WHO చేసిన హెచ్చరిక  కేంద్ర రాష్ట్ర పాలకులకు కనువిప్పు కావాలి.  ఆ హెచ్చరికలతోనైనా ప్రభుత్వాలు తమ బాధ్యతలను కర్తవ్యాలను గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది.

ఏ ప్రభుత్వం కూడా పరిశుభ్రమైన జలాలు, పోషకాహారం  గృహవసతి సౌకర్యాలు,  ఉపాధి అవకాశాలు కల్పించడం,  నాణ్యమైన ఉచిత విద్య వైద్యం కల్పిస్తామని ఏనాడు ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు. పైగా  చిన్నపాటి హామీలు వాగ్దానాలతో ప్రజల జీవితాలతో ఆడుకొంటూ  మధ్య మధ్యన క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు వంటి, అనారోగ్య ధూమపానం మద్యపానం వంటి వాటిని ప్రజల మీదికి ఎగ దోస్తు  ప్రజల జీవన ప్రమాణాలను నాశనం చేస్తున్న సంగతి మనకు తెలుసు. కొద్ది రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన మద్యపానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయగలిగిన సత్తా కేంద్ర ప్రభుత్వానికి లేదా?  మద్యపానం ద్వారా వచ్చే ఆదాయం పైన మాత్రమే ఆధారపడి పరిపాలన చేస్తామని అనడం  పాలకులు తమ వైఫల్యాన్ని అంగీకరించడమే అవుతుంది. "మంచి ఆరోగ్యం మంచి విద్య అందించగలిగితే  తమ బతుకులు తాము బతుకుతారు. కష్టించి చెమటోడ్చి ఆదాయ మార్గాలను వెతుక్కుని  ఆత్మగౌరవంతో ప్రజలు జీవిస్తారు. కానీ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించకుండా  యాచకులుగా మార్చే క్రమంలో  ప్రభుత్వాలు కాలయాపన చేసి ఇలాంటి అనారోగ్య కారక పరిస్థితులను కల్పించి ప్రభుత్వాలపై ఆధారపడే విధంగా నెట్టివేయడం నిజంగా  విచారకరం.ప్రపంచ దేశాలతో పోటీ పడదాం అనుకుంటే ఇదే నా మన పోటీ? రక్త  డయేరియా, డీసెంట్రీ ఇతర ప్రమాదకరమైనటువంటి రోగాల బారిన పడుతూ ప్రతి ఏటా ముఖ్యంగా వేసవిలో  ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉంటే  ప్రభుత్వాలు మాత్రం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు,  ప్రభుత్వ విధానాల పట్ల లేనిపోని కల్పనలతో కూడిన ప్రకటనలు  విష ప్రచారం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.

అనేక హాస్టల్లో వసతి గృహాలలో  చదువుకుంటున్న పేద పిల్లలు  కలుషిత ఆహారం తిని ఎంతోమంది మృత్యువాత పడుతూ ఉంటే స రపరా అవుతున్నటువంటి పాలు తాగి కూడా వందలాదిమంది చనిపోతున్నటువంటి దయనీయ పరిస్థితులకు నిలయం మన భారతదేశం.  అల్లము వెల్లుల్లి పేస్ట్, కారప్పొడి పాలు,  సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనం  ఇలా ప్రతిదీ కల్తీమయం అవుతూ ప్రభుత్వాల కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ఆ కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే ఎవరిని నిందించాలి? ఎవరిని బాధ్యులను చేయాలి?  ఈ అనాగరిక పరిస్థితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్యాన్ని న్యాయ వ్యవస్థ పట్టించుకుంటే బాగుంటుంది.  ఎందుకంటే గతంలో  దేశంలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు  మంచినీటి వసతి పైన న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు మంద లిస్తే కానీ ప్రభుత్వాలు కదల లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్  జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333