పదేళ్లుగా పక్కదారి పట్టిన ప్రధాన సమస్యలు
నిర్బంధం అణచివేత, విచారణ ఖైదీల పేరుతో కాలయాపన ప్రజాస్వామ్యానికి ద్రోహం తలపెట్టింది.
ఉపాధి ఉద్యోగ అవకాశాలు మృగ్యం కాగా ఏడాదికి కోటి ఉద్యోగాల హామీ కలగా మిగిలిపోయింది.
30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోగా కులగణన వ్యతిరేకించడం బీసీ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా?
-- వడ్డేపల్లి మల్లేశం
ఇండియా కూటమి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గితే కుల గణన చేసి ఆయా వర్గాలకు ప్రయోజనం కలిగిస్తామని, రాజ్యాంగబద్ధ హక్కులను సాధించి పెడతామని కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగపూర్ లో జరిగిన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఎంతోకాలంగా బీసీ వర్గాలను కేంద్రం అన చివేస్తున్న ధోరణికి అడ్డం పడుతున్నది. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కావాలని డిమాండ్ చేస్తున్నటువంటి వర్గాలు గత కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చినప్పటికీ, మరొక్క వైపు సుప్రీంకోర్టు కూడా కేంద్రాన్ని ప్రశ్నించినప్పటికీ కూడా సానుకూలంగా స్పందించని కేంద్రం కుల గణన ద్వారా కులతత్వం పెరిగిపోతుందని కల్లబొల్లి కబుర్లు చెప్పడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతారహిత్యానికి నిదర్శనం కాదా! ఓబీసీగా చెప్పబడుతున్న ప్రధానమంత్రి పదేపదే కుల గణనను దాటువేసి ఇటీవల కాంగ్రెస్ కేంద్రాన్ని కులగరణకు డిమాండ్ చేసిన సందర్భంలో ప్రధాని మాట మార్చి పేదలు అనే కులం ఒక్కటే ఉంటుందని నమ్మబలకడం పైన రాహుల్ చేసిన విమర్శ కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉన్నది. సామాన్యులకు రాజ్యాధికారాన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్న పార్టీలకే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసినట్లయితే వ్యతిరేకించిన పార్టీకి గుణపాఠం కాగలదు. ఆ వైపుగా దేశస్థాయిలో ప్రజలు ముఖ్యంగా బీసీ వర్గాలు జాగరూకులు కావలసిన అవసరం చాలా ఉన్నది. దేశంలో నిర్బంధం అనచి వేత రాజ్యమేలుతుంటే మేధావులు బుద్ధి జీవులు మానవ హక్కుల కార్యకర్తలు కటకటాల్లో ఊచలు లెక్క పెడుతుంటే విచారణ ఖైదీలు గానే దశాబ్దాల తరబడి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, పౌరహక్కుల నేత వరవరరావు వంటి మేధావులు శిక్ష అనుభవించడాన్ని ఏ రకంగా చూడాలి?. ఖైదీల హక్కులను, జీవించే రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా కాలరాచే ధోరణికి బిజెపి ప్రభుత్వం చరమగీతం పాడకపోతే రాబోయే ఎన్నికల్లో పరాభవాన్ని చవి చూడవలసి ఉంటుంది.
ఇది కేవలం బిజెపికే కాదు కాంగ్రెస్కు కూడా పరీక్షా సమయమే. కాంగ్రెస్ హయాంలో రూపొందిన దేశద్రోహ చట్టం ఉప కింద దేశవ్యాప్తంగా అనేక మందిని శిక్షించడం రాజ్యాంగ ఉల్లంఘన కాగా బిజెపి ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేయడం మరింత ప్రజా వ్యతిరేక చర్యగా మిగిలిపోతున్నది. స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం వంటి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలు ఎంతకైనా తెగించి పోరాడే సమయం ఇది. ప్రభుత్వ మనుగడ కోసం ఆత్మ రక్షణ కోసం పాలకులు చట్టాలను దుర్వినియోగం చేసి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే బిజెపితో సహా రాబోయే ఇండియా కూటమికి కూడా గడ్డు కాలమే. అయితే ప్రస్తుతం 10ఏళ్లుగా కొనసాగుతున్న అప్రజా స్వామిక పరిపాలనకు ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం నేపథ్యంలో కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఇండియా కూటమి వైపు ప్రజలు దృష్టి సారించవలసిన అవసరం ఉంది. లేకుంటే మూడోసారి వరుసగా ఎన్నికైతే ఇక మనిషి మనుగడ ప్రశ్నార్థకం కాక మానదు సుమా ! బ్రిటిష్ పరిపాలన కాలంలో ఆనాటి రాజ్యాలు కుమ్మక్కయి ప్రజల హక్కులను కాలరాచి తమ ఉనికి చాటుకున్నవి. ఆ దుస్థితిని రూపుమాపడానికి, స్వతంత్ర భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛగా బతకడానికి అంబేద్కర్ వంటి నేతలు రాజ్యాంగ రూపకల్పన చేసి ఓటు హక్కుతో సహా సమన్యాయాన్ని లౌకిక సామ్యవాద గణతంత్ర రాజ్యాన్ని అందించిన విషయం తెలుసు కదా! కానీ మరో రూపంలో నేడు దేశంలో స్వాతంత్ర్య పూర్వ పరిస్థితులు యదేచ్చగా కొనసాగడాన్ని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటే
స్వేచ్ఛ అనే పదాన్ని కూడా కనీసం ఉచ్చరించడానికి అవకాశం ఉండదేమో!. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదరికం నిరుద్యోగం ఏ స్థాయిలో తగ్గిందో ఇప్పటికీ స్పష్టమైన గణాంకాలు లేవుసంపద కేంద్రీకరణ యధేచ్ఛగా సాగుతున్నది.. సామాన్య కార్యకర్త కూడా పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించగలిగే ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వంలో కూడా చూడగలము . అలాంటి అవకాశాలు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీతో పాటు ఏ పార్టీలో ఉన్నాయో సమీక్షించుకోవాల్సిన అవసరం మనందరి పైన కూడా ఉంది .
బిజెపి పై కాంగ్రెస్ విమర్శలు -
మూడవసారి బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూ ని అవుతుందని ఇండియా కూటమినీ విచ్ఛిన్నం చేయడానికి భాజపా ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదు. పరోక్షంగా ప్రత్యామ్నాయ వ్యవస్థ అధికారంలోకి రాకుండా చేయడం వలన ప్రజలకు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉంది కనుక ప్రజలందరూ కూడా ఈ విమర్శపై దృష్టి సారించాలి. ప్రస్తుత పార్లమెంటులో బీసీ సభ్యుల సంఖ్యతో పాటు వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా తక్కువేనని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను ప్రకటించిన ప్రభుత్వం ఏ నాడు వాటిపై శ్రద్ధ చూపలేదని , ప్రస్తుతం 30 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయవలసింది ఆపడం అంటే బీసీ వర్గాలకు అవకాశాలు కల్పించడానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడమేనని కర్గే చేసిన విమర్శ అంతరార్తాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇప్పటికీ పేదలు మహిళల సాధికారత క్రమంగా కనుమరుగవుతున్న వేల కాపాడుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉన్నది. ఇదే సందర్భంలో ఇండియా కూటమి ఈ విషయంలో ఇచ్చిన స్పష్టమైన హామీని నిలబెట్టుకోవడానికి ఉమ్మడి కార్యాచరణలో భాగం చేయడం కూడా ప్రజల విశ్వాసాన్ని పొందడానికి తోడ్పడుతుంది.
ఇక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి నెగ్గితే బీసీ వర్గాల ప్రయోజనానికి సంబంధించిన కుల గణన చేసి తీరుతామని ప్రకటించడం ఒక అంశమైతే బీసీ వర్గాలు తమ సాధికారతను గత పదేళ్లుగా విస్మరించిన విషయాన్ని సోయి తెచ్చుకోకపోతే రాబోయే కాలంలో ఎవరు అధికారంలోకి వచ్చిన అంత నమ్మశక్యo కాదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు తమ ప్రాంతాలలో కుల గణన చేపట్టగా ఆంధ్రప్రదేశ్ సిద్ధపడినట్లు తెలుస్తున్నది అదే మాదిరిగా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా స్వతంత్రంగా కులగనన చేపట్టినట్లయితే ఆ నివార్యంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా ఆచరించి తీరవలసి ఉంటుంది. ఆ రకమైనటువంటి రాష్ట్రాల పైన చేసే ఒత్తిడి కూడా కేంద్రం గనన చేపట్టడానికి దారితీస్తుందని ఆ వైపుగా సరైన ఒత్తిడి జరగాలని రాజకీయనిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో ఖైదీల స్థితిగతులు కారాగారాల దుస్థితి గందరగోళంగా ఉంటే విచారణ ఖైదీలే లక్షల్లో దశాబ్దాల తరబడి కొనసాగడాన్ని ఏ నాడు ఆలోచించని కేంద్రం అని రంగాలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది అనడానికి నిదర్శనం కాదా?
అంతేకాదు రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను బలహీనుల చేయడానికి సిబిఐ దాడులకు పూనుకోవడాన్ని ఇండియా కూటమి ఖండిస్తున్నది. అదే సందర్భంలో ప్రజాసంఘాలు మేధావులు కూడా ప్రతిఘటించకపోతే ప్రశ్నించిన ప్రతి వారిని తీవ్రవాదిగా దొ షిగా నిలబెట్టే ప్రమాదం కనుచూపుమేరలోనే కనబడుతున్నది. సంతాన ఉత్పత్తి ఖైదీల ప్రాథమిక హక్కుగా ఢిల్లీ హైకోర్టు గుర్తించి 14 ఏళ్లుగా ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి భార్య డిమాండ్ మేరకు పెరోల్ పై నాలుగు వారాలు మంజూరు చేయడాన్ని బట్టి చూస్తే ఈ దేశంలో నేరం ఆరోపించబడి విచారణ లేకుండానే దశాబ్దాలు గడుస్తున్న పాలకులు, చట్టం మౌనంగా ఉండడాన్ని సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న నిస్సహాయ స్థితిని అర్థం చేసుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి ఇంతకంటే దృష్టాంతం మరొకటి ఉంటుందా? ఆలోచించాలి. రాబోయే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు అనే అంశం పైన చర్చ కంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే విషయాల పైన దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్న వేళ శరద్ పవర్ చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.
1977లో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక కూటమి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని విజయం సాధించిన తర్వాతనే మొరార్జీ దేశాయ్ నీ ప్రధానిగా ఎన్నుకున్నామని ప్రకటిస్తూ ప్రస్తుతం ఇండియా కూటమి కూడా అదే బాటలో నడుస్తుందని చెప్పడం ప్రధాని ఎవరనే దానికంటే ఎందుకోసం ఇండియా కూటమి విజయం సాధించాలి? ప్రస్తుత ప్రభుత్వంలోని లోపాలు ఏమిటి? సవరించుకోవడం ఎలా? అనే అంశాలపై దృష్టి సారించడం ముఖ్యమని తేలిపోతున్నది. ఇక గత పదేళ్లలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం, చేసి పేద ప్రజల హక్కులను కాలరాచి, ప్రజా సంపదని కొల్లగొట్టిన తీరు సామాన్య ప్రజానీకాన్ని ఆలోచింప చేస్తుందని సరైన సమయంలో ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడుతుందని ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత ( choutapally) హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)