జర్నలిస్ట్ పుల్ల రవీందర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
జర్నలిస్టుల రక్షణ చట్టం లేకనే జర్నలిస్టులపై దాడులు.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ.
హైదరాబాద్, 22 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-
భూపాలపల్లి జిల్లాలో దళిత (మాదిగ )జర్నలిస్ట్ పుల్ల రవీందర్ ఇంట్లో చొరబడి అతనిపై తీవ్రంగా దాడి చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాదులో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూ కబ్జాల విషయంలో పుల్ల రవీందర్ వార్తలు రాస్తే అక్రమార్కులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. సరైన వైద్యం కూడా అందించకుండా నిర్లక్ష్యం చేయటం,పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దోషులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అన్నారు. జర్నలిస్టుల పై జరిగే దాడుల నివారణకు జర్నలిస్టు రక్షణ చట్టం లేకపోవడమే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రవీందర్ కు పూర్తిస్థాయిలో వైద్యం అందించడంతోపాటు వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దళిత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు,బెదిరింపులు, హత్యలు రోజురోజుకు తీవ్రమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు బొల్లె రాజేష్, సుక్క అశోక్, సుంచు లింగయ్య, రాయుడు తదితరులు ఉన్నారు.