కోరుట్లలో విద్యుత్ వినియోగ దారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
కోరుట్ల. 11 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :- విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీజీఆర్ఎఫ్ సంస్థ పని చేస్తుందని సంస్థ అధ్యక్షుడు ఎరుకల నారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్)ను నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా నారాయణ మాట్లాడుతూ కోరుట్ల డివిజన్ పరిధిలో 60 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. వేసవిలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే ధ్యేయంగా అధికారులు పని చేయాలన్నారు.
విద్యుత్ వినియోగదారులు సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. రైతులు మోటర్లకు కెపాసిటర్లు బిగించుకోవడం ద్వారా విద్యుత్తును ఆదా చేసుకోవడం . జరుగుతుందన్నారు. పట్టణ, గ్రామ స్థాయిలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కుంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయం, హెచ్చు తగ్గులు, మీటర్ల సమస్యలు, అధిక బిల్లులు, ట్రాన్స్ఫార్మర్లలో ఓవర్లోడ్తో దగ్దమవడం, బిల్లుల పేరులో మార్పు, మార్పు, స్తంభాల మార్పు, లూజ్ లైన్లు తదితర సమస్యల పరిష్కారంపై ఫిర్యాదులు అందిన తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని, కోరుట్లలో విద్యుత్ బిల్లులకు సంబంధించి మూడు ఫిర్యాదులు, లూజ్ లైన్పై మరో ఫిర్యాదు అందినట్లు తెలిపారు. కాగ మండలంలో విద్యుత్ లైన్మెన్ల కొరత ఉందని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి ఇప్ప రాజేందర్ అధికారులకు విన్నవించారు.