ఓటరు జాబితా సవరణ నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్
ఎస్ ఐ ఆర్ పరిశీలన..
అర్హులైన వారి పేర్లను నమోదు చేయాలి..
తప్పు లేని ఓటరు జాబితాను రూపొందించాలి..
అధికారులకు పలు ఆదేశాలు జారీ..
తిరుమలగిరి 19 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని 315, 316 పోలింగ్ కేంద్రాల్లో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారి పేర్లను నమోదు చేయడంతో పాటు అవసరమైన సవరణలను వెంటనే చేపట్టి తప్పులేని ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహశీల్దార్ వినోద్ కుమార్, నాయబ్ తహశీల్దార్ జాన్ మహ్మద్, వార్డు అధికారి పరశురాములు, సీనియర్ అసిస్టెంట్ అశోక్, బీఎల్వోలు పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ అవసరమైన సవరణల ప్రక్రియను నిర్వహించారు. పారదర్శకమైన, పటిష్టమైన ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు.