ఎస్ఐఆర్ పై ఓటర్లకు అవగాహన అవసరం
అన్నదాతలు నానో యూరియా పై దృష్టి సారించాలి.
ఫార్మర్ రిజిస్ట్రీతో అర్హులైన రైతులందరికీ సంక్షేమ పథకాలు.
ప్రజలు పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇవ్వాలి.
*గ్రామసభలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బా
షా షేక్.*
జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. : ఓటరు జాబితాలో తప్పిదాలు లేకుండా, పారదర్శకంగా రూపొందించేందుకు ఉద్దేశించిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ప్రతి ఓటరుకు అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డ్ సభల్లో సోమవారం మానవపాడు మండలం బోరవెల్లి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రధానంగా గ్రామసభల్లో తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం స్పెషల్ డ్రైవ్ తో ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం జరుగుతుందన్నారు. రైతులు నానో యూరియా పై దృష్టి సారించాలని, సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పొందవచ్చన్నారు. ఈ ఏడాది వర్షపాతం తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల అంచనాల మేరకు రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల ప్రకారం పంటలు సాగు చేయాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ తో అర్హులైన రైతులందరికీ వ్యవసాయ సంబంధ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. బిపి, షుగర్, తదితర వ్యాధులు ఉన్న గ్రామస్తులు ప్రభుత్వ వైద్యశాలలు అందించే చికిత్సను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు పారిశుద్వానికి ప్రాధాన్యత నివ్వాలని, గృహ సంబంధ, ఇతర వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తకుండీలను వినియోగించాలన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు గ్రామంలో పిచ్చికుక్కల బెడదను నిర్మూలించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పలువురు గ్రామస్తులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కూరగాయల విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. అంతకుముందు స్వచ్ఛ గ్రామ పంచాయతీ, స్వచ్ఛ తెలంగాణ ఆవశ్యకతపై చిత్రీకరించిన వీడియోను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, గ్రామ సర్పంచ్ హరిశ్చంద్రా రెడ్డి, ఉప సర్పంచ్ సీతారాముడు తహసిల్దార్ మన్సూర్ అలీ సిద్ధికి, ఎంపీడీవో రాఘవ, ఎస్సై తరుణ్ కుమార్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్, ఏఈఓ నరసింహ, పంచాయతీ కార్యదర్శి అరుణ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.