లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్
సర్కారు బడిలో తేజస్ నంద్ లాల్ పవార్ సందడి
హుజూర్ నగర్ గర్ల్స్ హైస్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
చాక్ పీస్ పట్టి విద్యార్థులకు లెక్కలు నేర్పిన వైనం.
చదువుతో పాటు క్రమశిక్షణపై విద్యార్థులకు దిశానిర్దేశం ఆయన జిల్లాకు బాస్.. నిత్యం ఫైళ్లు, సమీక్షలతో బిజీగా ఉంటారు. కానీ, ఒక్కసారిగా కలెక్టర్ తన హోదాను పక్కన పెట్టి లెక్కల మేస్టార్ అవతారమెత్తారు. చేతిలో చాక్ పీస్ పట్టుకుని బ్లాక్ బోర్డుపై లెక్కలు వేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.బ్లాక్ బోర్డు వద్దకు వెళ్లి-పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ నేరుగా తరగతి గదిలోకి వెళ్లారు. అక్కడ విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. చదువు ఎలా సాగుతోంది? ఉపాధ్యాయులు సరిగ్గా వస్తున్నారా? అని ఆరా తీశారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు గణితంలో ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా బ్లాక్ బోర్డు దగ్గరకు వెళ్లి విద్యార్థులకు లెక్కలు బోధించారు. కష్టమైన సూత్రాలను సులభంగా ఎలా గుర్తుంచుకోవా లో వివరించారు. కలెక్టర్ స్వయంగా పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.
అనుమానాలు నివృత్తి.
కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులు అడిగిన పలు సందేహాలను కలెక్టర్ ఓపిగ్గా నివృత్తి చేశారు. చదువుపై ఏకాగ్రత ఉంచాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బడికి రావాలని సూచించారు. అనంతరం పాఠశాల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానోపాధ్యాయులతో చర్చించారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారి డివిజనల్ అధికారి శ్రీనివాసులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
---------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారీ చేయనైనది