ఆధునిక వ్యవస్థకు అంబేద్కరి జాన్ని జోడించాలి

ఆధునిక యుగ కర్త అంబేద్కర్ను నేటి తరం మార్గదర్శ
కులుగా స్వీకరించాలి.* ఎందుకంటే అంబేద్కర్ అందరివాడు కనుక
---వడ్డేపల్లి మల్లేశం
స్వాతంత్రానంతరం చాలా కాలం వరకు అంబేద్కర్ను సమాజం మరిచిపోయింది. సుమారు మూడు దశాబ్దాల నుండి మాత్రమే అంబేద్కర్ గురించిన స్పృహ సోయి అనేక రాజకీయ పార్టీలు,ఆలోచనాపరులకు ప్రారంభమైనదనేది నగ్న సత్యం . బుద్ధి జీవులు మేధావులకు కూడా ఆ మధ్యకాలంలో వచ్చిన కొంత గ్యాప్ అంబేద్కర్ జీవన సరళిని, సైతాంతిక పునాదిని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి వీలు కాకపోవడంతో ఎంతో నష్టం జరిగింది. ఆధునిక సమాజo ఆలస్యంగానైనా అంబేద్కర్ ను గుర్తించిన తర్వాత కూడా ఆయన దళితులకు చెందిన వాడు మాత్రమేనని , దళితుల అభ్యున్నతి కోసమే పనిచేసినవాడు కనుక అందరివాడు కాదు అనే ఒక దుర్మార్గమైన భావన సమాజంలో బలంగా నాటుకుపోయింది.
గత రెండు దశాబ్దాలకు పైగా అంబేద్కర్ మీద జరిగిన చర్చలు, ప్రసంగాలు, విగ్రహాల స్థాపన సందర్భంగా సెమినార్లు, పత్రికల్లో అనేక కథనాలు, వ్యాసాలు, చర్చ గోష్టు ల కారణంగా కొంత సమాజంలో అంబేద్కర్ గురించిన చైతన్యం కార్యరూపం దాల్చిన మాట వాస్తవం . అయినప్పటికీ ఇంకను ఆయన చేసిన కృషి సమాజం మొత్తానికి సంబంధించినదని, కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదుఅని, అణువణువునా ఆయన యొక్క కృషి పాత్ర భాగస్వామ్యము ఆలోచన ఉన్నది అనే అభిప్రాయాన్ని సమాజం దృష్టికి మనం తీసుకువెళ్లడానికి ఇన్ని దశాబ్దాలు పడుతున్నది అంటే ఈ దేశంలో కులం ఎంత బలవత్తరమైనదో దళిత జాతికి చెందినటువంటి అంబేద్కర్ను అందరివానిగా చర్చించటానికి ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆయన ఇ జాన్ని, సిద్ధాంత ప్రాతిపదికను, భారతదేశ విభిన్న రంగాలకు సంబంధించిన తాత్వికతను అర్థం చేసుకోవడం ద్వారా ఆయనను అందరివానిగా చేసే బలమైన కృషి జరుగుతున్నది. మరింత జరగవలసిన అవసరం కూడా ఉన్నది.
అంబేద్కర్ ఇజం అంటే భారతదేశo గురించిన ఆయన ఆలోచనలే
ఆయన ఆలోచనల పునాదిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నాటుకు పోవడానికి కారణమైనది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆయన ఆలోచనలు, ప్రయత్నాలు, అర్థశాస్త్ర అధ్యయనము ద్వారా పొందిన జ్ఞానము ఎంతో తో డ్పడింది. అది సర్వ మానవాళికి సంబంధించిన అంశం కాదా? ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేయడంతో పాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పిహెచ్డిని పొందిన తర్వాత అర్థశాస్త్రంలో ఆయన ప్రతిభను నేటితరం మరింతగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.1927 - 28 ప్రాంతంలోనే అంబేద్కర్ వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించాలని, పారిశ్రామికీకరణతో ఆర్థిక వ్యవస్థలో రావలసిన మార్పుల గురించి ప్రస్తావించిన విషయం చాలామందికి తెలియకపోవడం వలన ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే పరిమితం కావడం ఆందోళన కలిగించే విషయం. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక స్థితిగతుల పైన సమగ్ర అవగాహన కలిగి భవిష్యత్తును దర్శించిన దార్శనికునిగా తత్వవేత్తగా ఎదిగిన అంబేద్కర్ ను భారతదేశాన్ని ఆధునిక పరిజ్ఞానంతో , పారిశ్రామిక, వ్యవసాయ, నూతన నాగరికత గల దేశం గా చూడాలని ఆకాంక్షించిన వ్యక్తిగా మనము గుర్తించాలి.
అంబేద్కర్ ఆలోచనలు , ఆశయాలు, ఆకాంక్షలు, తాత్వికతను నేటి తరానికి అందించే కృషి జరగాలి. అదే సందర్భంలో భారతదేశ పునర్నిర్మాణానికి యువత అంకితమై పని చేసే విధంగా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. "అసమానతలు అంతరాలను నిర్మూలించి సమ సమాజాన్ని స్థాపించే దిశగా కృషి చేసే మార్క్సిజానికి- తోడుగా కుల వ్యవస్థతో అతలాకుతలమైన భారతదేశంలో నూతన సామాజిక రాజకీయ మానవీయ విలువలను అంబేడ్కరిజం పేరుతో అన్వయించడం ద్వారా కుల నిర్మూలన అంతరాల నిర్మూలన సాధ్యమవుతుందని" నమ్మిన మేధావులు గత దశాబ్ద కాలంగా ఈ దేశంలో లాల్ నీల్ ఏకం కావాలని పిలుపునివ్వడం ఆ వైపుగా వామపక్షాలు అంబేద్కరి జాన్ని గౌరవించి ఆచరించే సంఘాలు కలిసి పని చేయడాన్ని మనం కొంతవరకు గమనించవచ్చు .
ఎందుకు ఆయన భారత దేశ యుగకర్త?:-
రాజకీయ పార్టీలు గత మూడున్నర దశాబ్దాలకు పైగా అంబేద్కర్ను ఆలోచించకుండా ప్రస్తావించకుండా పూల మాలలు వేయకుండా తమ ఉనికి లేదు అనే స్థితికి వచ్చినాయంటే భారతదేశ రాజకీయాలలో, సామాజిక జీవితంలో, స్వాతంత్రానంతర పరిస్థితులు, రాజ్యాంగ నిర్మాణము, మానవ హక్కుల కృషిలో అంబేద్కర్ పోషించిన గొప్ప పాత్రను గుర్తించడం వల్లనే సాధ్యమైనది. ఇప్పటికీ అంబేద్కర్ను అవమానించి నిరాకరించి ఆయన ఆలోచనలను అస్థిర పరచాలనే వ్యక్తులు రాజకీయ పార్టీలు లేకపోలేదు. కానీ కొంత ఆలస్యంగా నైనా ఆయన భారతదేశ సామాజిక రాజకీయ రంగానికి చేసిన కృషిని గుర్తిస్తున్న కారణంగా భారతదేశ యుగ కర్తగా ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించిన విజ్ఞాన వేత్తగా గుర్తించబడిన విషయం తెలుసు.అందుకు ప్రతిగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీని అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవం గా జరుపుకోవడం అంటే నిజంగా మనలను మనం గౌరవించుకోవడమే....అంబేడ్కర్ ను ప్రపంచం కూడా గుర్తించి గౌరవించడమే అవుతుంది. విభిన్న భౌగోళిక జాతులు, మతాలు, భాషలు కులాలు, ప్రాంతాలు , ఇతర అంశాలతో కూడుకున్న భారతదేశం సమాఖ్య రాజ్యాంగా లౌకికత్వాన్ని అమలు చేసే దేశంగా వి లసిల్లాలని అంబేద్కర్ ఆశించి ఆ మేరకు రాజ్యాంగంలో అనేక ఏర్పాట్లు చేసినాడు.
అవినీతి, వ్యక్తి ఆరాధన, నిర్లక్ష్యానికి తావు లేకుండా కృషి చేసినప్పటికీ రాజకీయ పార్టీల నిర్లక్ష్యం అధికార దాహం వలన పేద వర్గాలు , ఆదివాసీలు, అట్టడుగు వర్గాలు, దళిత జాతుల హక్కులు అణచివేయబడుతూనే వున్నాయి. ఆ వర్గాలు నిర్బంధానికి గురవుతున్న విషయం కూడా మనకు తెలిసిందే . ఇక్కడే పాలకులు రాజకీయ పరిస్థితులను అణచివేయబడిన వర్గాల అభివృద్ధిని జోడించి సమున్నతమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అంబేద్కర్ ఆలోచనకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది.
ఇక ఆయన ఎందుకు అందరివాడు అని చెప్పడానికి వేల అంశాలు ఉన్నప్పటికీ కావాలని కుట్ర జర్గుతూనే వున్నది. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయాలలో అంబేద్కర్ మీద జరిగిన పరిశోధన భారతదేశంలో జరగలేదంటే అతిశయోక్తి కాదు . ఇప్పటికీ అందరి వాడిగా గుర్తించకపోవడం వెనుక ఉన్న అంశం ఏమిటో అర్థం కావడం లేదు . అయితే ఇటీవల కాలంలో దేశంలోని ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాలలో అంబేద్కర్ పరిశోధనా కేంద్రాలు తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించడంతోపాటు నిర్వహించడం ద్వారా ఆయన రచనలలోని ఆర్థిక సామాజిక మూలాలు వెలుగు చూ స్తున్నట్లు మనం గ్రహించవచ్చు . వివిధ సందర్భములలో ఆయన నడిపిన పత్రికలు, నిర్మించిన సంస్థలు, రాజకీయ పార్టీలు, వెలుగు చూసిన ప్రణాళికలు వంటి అంశాల పైన ఆధునిక యువత దృష్టి సారించడం ద్వారా అదే స్థాయిలో ప్రభుత్వం పరిశీలనకు అవకాశాలు కల్పించడం ద్వారా అంబేద్కర్ యొక్క ఆలోచన ధోరణిని నేటి తరాలతో పాటు రేపటి తరానికి కూడా అందించడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది.
"ముఖ్యంగా దేశంలోని భూమిని, పరిశ్రమలను పెట్టుబడిదారీ వర్గం చేతిలో ఉంచకూడదని జాతీయం చేయాలని ఆయన సూచించడంతోపాటు దళిత బహుజన మైనారిటీలు రాజకీయ అధికార సాధన దిశగా కృషి చేయాలని కూడా అందుకు తమ ఓటు హక్కును ఆయుధంగా ఉపయోగించుకోవాలని చేసిన సూచన ఇటీవల ఎన్నికల సందర్భంలో విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయాన్ని కాదనలేము". అంబేద్కర్ జీవించి మరణించిన తర్వాత ఆయన ఆలోచనల ద్వారా ప్రభావితమైనటువంటి పరిపాలన, రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థల స్వరూపాన్ని మనం దగ్గరగా అధ్యయనం చేసినట్లయితే ఆయనకు ముందున్న భారతదేశం కంటే తర్వాత భారతదేశ పాలనలో మెరుగైన పరిస్థితులను, నూతన విలువలను, ఆలోచనలను చూడవచ్చు. అదంతా ఆయన తర్వాత తరం పరిశీలించి పరిశోధించి సమాజానికి ఆ కృషిని అందించడం వల్లనే సాధ్యమైనది.ఆకృషిని యువత కూడా కొనసాగించాలి. అందుకే ఆయన భారత దేశపు యుగకర్త.... భవిష్యత్తును ముందుగానే ఊహించి దర్శించినటువంటి దార్శనికుడు.అయితే 1956 డిసెంబర్ 6 తేదీన ఆయన మరణo వెనుక వున్న మిస్టరీ చిక్కుముడి ఇప్పటికీ వీదలేదని విచారణ ఆలస్యంగా నిర్వహించినా దానిని నెహ్రూ ప్రభుత్వం బయట పెట్టకపోవడం పట్ల ఇప్పటికీ ఆందోళన వ్యక్తం అవుతున్నది.(అంబేడ్కర్ వర్ధంతి ప్రత్యేక వ్యాసం)
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌడపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)