NEET (UG) పరీక్షల సందర్భంగా గద్వాల పట్టణంలో 163 BNSS అమలు – కట్టుదిట్టమైన భద్రతా చర్యలు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు
జోగుళాంబ గద్వాల జిల్లాలో మే 3వ తేదీన నిర్వహించబడనున్న NEET (UG)–2026 ప్రవేశ పరీక్షల నేపథ్యంలో పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు గద్వాల పట్టణంలో సెక్షన్ 163 భారతీయ నాగరిక సురక్షా సంహిత–2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, శాంతి భద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష రోజు ఆదివారము మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 7:00 గంటల వరకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ మేరకు పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా ఉండటం పూర్తిగా నిషేధమని, అలాగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, దర్నాలు నిర్వహించరాదని ఎస్పీ తెలిపారు. మైకులు, డీజేలు వినియోగంపై కూడా పూర్తి నిషేధం విధించినట్లు చెప్పారు. పరీక్షల సమయాల్లో ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలు, స్టేషనరీ దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, అవన్నీ గద్వాల పట్టణ పరిధిలోనే ఉన్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీస్ పెట్రోలింగ్ బృందాలను నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు, అలాగే నిఘా బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
ఈ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.
....పి ఆర్ ఓ
జిల్లా పోలీస్ కార్యాలయం,
జోగుళాంబ గద్వాల్ జిల్లా.