శ్రీలక్ష్మీనృసింహస్వామి తిరు కళ్యాణోత్సవములకు హాజరయ్యే
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మట్టపల్లి మహా క్షేత్రం, మఠపల్లి నందు శ్రీ స్వామివారి తిరు కల్యాణ మహోత్సవములు, ది.29.04.2026 నుండి 04.05.2026 వరకు నిర్వహించుటకు గాను ముందస్తు ఏర్పాట్ల పై సంబంధిత శాఖల అధికారులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం లోని వి సి హాల్ నుండి బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వేబేక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇట్టి కళ్యాణ మహోత్సవమునకు విచ్చేయు వేలాది మంది భక్తులకు ఎటువంటి ఆటంకములు జరగకుండా మిషన్ భగీరథ శాఖ నిరంతరం నీటి సరఫరా చేయాలని, పోలీస్ శాఖ వారిని పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపు మరియు ఒక అంబులెన్స్ సిద్ధముగా ఉంచే విధముగా ఏర్పాటు చెయ్యాలని, ఆర్టీసీ కళ్యాణ మహోత్సవ ములకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని , విద్యుత్ శాఖ సరఫరాకు ఆటంకం కలగకుండా నిరంతరం సరఫరా ఉండే విధంగా చూడాలని, మట్టపల్లి గ్రామపంచాయతీ దేవాలయ పరిసర ప్రాంతాలు పారిశుధ్యం చేయుటకు, ఫైర్ సర్వీస్ వారిని ఫైర్ ఇంజన్ స్టాండ్ బై చేయుటకు, సాగర్ సిమెంట్ మరియు నాగార్జున సిమెంట్ వారి సహకారంతో భక్తులకు స్నాక్స్ అందించుట, దేవస్థానం వారు క్యూలైన్స్ ఏర్పాటు మరియు పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరా ఏర్పాటు, వృద్ధులకి, దివ్యాంగులకు ఉచిత ఆటో ఏర్పాటు మొదలగునవి పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసి నదిగా సూచనలు చేశారు.
దేవస్థానం అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు వారి యొక్క సహాయ సహకారాలు సేవా దృక్పథంలో అందించి శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవములు విజయవంతం చేయుటకు కోరినారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జడ్పీ సీఈఓ డి శిరీష, ఆర్డిఓ వి.శ్రీనివాసులు , కె భాస్కర్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కే భాస్కర్, నల్గొండ, దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.