ప్రైవేట్ స్కూళ్ల అధిక ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి. లంబాడి విద్యార్థి సేన
చర్యలు తీసుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో ఉద్యమం చేపడతాం
సూర్యాపేట, సెప్టెంబర్ 07: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక భారం మోపుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని లంబాడి విద్యార్థి సేన నాయకులు డిమాండ్ చేశారు. అలాగే నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను డిస్ప్లే చేయని పాఠశాలలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు సూర్యాపేట జిల్లా డీఈవో అశోక్ కుమార్ ని లంబాడి విద్యార్థి సేన నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలను డీఈవోకు వివరించి, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, ఫీజుల వివరాలను సక్రమంగా డిస్ప్లే చేయకపోవడం వంటి అంశాలపై సమగ్రంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర నాయకులు ధరావత్ రవి నాయక్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ వీరన్న నాయక్, సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ శివ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్ల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధికారులు పాఠశాలలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేలితే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే, సూర్యాపేట జిల్లా జేఏసీ కమిటీతో పాటు అన్ని రంగాల విద్యార్థి సంఘాల నాయకులను ఏకం చేసి ఈ సమస్యపై ఉద్యమంగా పోరాటం చేస్తామని లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ వీరన్న నాయక్ హెచ్చరించారు.....