డి అడిక్షన్ సెంటర్ నందు బాధితులకు పండ్లు, క్రీడా సామాగ్రి అందించిన పోలీసులు, డాక్టర్స్.
హాజరైన రాష్ట్ర ఈగల్ పోలీస్ సిబ్బంది.
మత్తు రహిత సమాజమే లక్ష్యం: డీఎస్పీ ప్రసన్నకుమార్
సూర్యాపేట. 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లాను మత్తు రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ కేంద్రాన్ని పట్టణ సీఐ వెంకట్తో కలిసి ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న నలుగురు బాధితులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. మత్తు అలవాట్ల నుంచి ఉపశమనం పొందేందుకు వీలుగా క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై యుద్ధం ప్రకటించామని, పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. మద్యం తాగిన వారిని గుర్తించినట్లే, గంజాయి సేవించిన వారిని పట్టుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కిట్లను అందించిందని డీఎస్పీ అన్నారు. వ్యసనాల బారిన పడిన యువతను మార్చడానికి డీ-అడిక్షన్ కేంద్రం ఎంతో దోహదపడుతుందని, బాధితులు స్వచ్ఛందంగా చేరవచ్చని సూచించారు. మత్తు పదార్థాల సమాచారం కోసం ప్రజలు డయల్ 100, 112 లేదా 1908 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమం నందు రాష్ట్ర ఈగల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది, డాక్టర్స్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఉన్నారు.