ఎసిబి ఆఫీస్ ముందు శివ నాయక్ ను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాదు, 16 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ బంజారా గిరిజన విద్యార్థి సమైక్య అధ్యక్షుడు శివ నాయకును హైదరాబాదులో పోలీస్లు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్ళగా లంబాడా సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఏసీబీ దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏసీబీ కార్యాలయం ముట్టడించిన బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివ నాయక్ను మంగళవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ, లంబాడా (బంజారా) సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఏసీబీ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిపై వరుసగా దాడులు నిర్వహించడం పట్ల బంజారా సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొందని అన్నారు. ఏసీబీ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించి, ఏ వర్గాన్నీ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లంబాడా సమాజంపై వివక్షపూరిత ధోరణి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏసీబీ కార్యాలయం ముట్టడి సందర్భంగా శివ నాయక్తో పాటు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బంజారా వర్కింగ్ ప్రెసిడెంట్ డాన్ శ్రీను గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాక్ పతి నాయక్ సుధీర్ చక్ర మధు పలువురు బంజారా యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు శివానాయక్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బంజారా సమాజ హక్కులు, గౌరవం కోసం తమ పోరాటం కొనసాగుతుందని శివ నాయక్ తెలిపారు.