మాతృభూమిపై మమకారం
తన బడికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన మహేశ్వర్ రెడ్డి
గద్వాల, జూలై 11: తాను చదువుకున్న బడి రుణం తీర్చుకోవడంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సంగాల మహేశ్వర్ రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన ప్రాథమిక విద్యాభ్యాసానికి పునాది వేసిన పాఠశాల అభివృద్ధి కోసం ఆయన ఏకంగా రూ. 5 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు రూ. 5 లక్షల విరాళం చెక్కును ఈరోజు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల యాజమాన్యానికి అందజేయనున్నారు. పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న ఈ భారీ విరాళంతో పాటు, గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో జరగనున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కోసం ఆయన మరో రూ. 1,10,000 ఆర్థిక సహకారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని నేడు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ, తన చిన్ననాటి జ్ఞాపకాలను, మిత్రులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ఏమాత్రం మర్చిపోలేదు. మహేశ్వర్ రెడ్డి 1 నుండి 7వ తరగతి వరకు సంగాల ప్రభుత్వ పాఠశాలలో, 8 నుండి 10వ తరగతి వరకు గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (1996-97 బ్యాచ్), అలాగే ఇంటర్, డిగ్రీ విద్యను గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్గా స్థిరపడిన తర్వాత, నేడు తనవంతు బాధ్యతగా ఆయన చేస్తున్న ఈ ఆర్థిక సహకారం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు మరియు తోటి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.