బస్సులో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
జోగులాంబ గద్వాల 3 జనవరి 20 25 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా నందిన్నె గ్రామం సమీపంలో ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ మహిళను రాయచూరు జిల్లా బాయిదొడ్డి గ్రామానికి చెందిన నరేష్ వివాహమైంది. ఆరోగ్య పరీక్షల కోసం శుక్రవారం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి గద్వాల ఆర్టీసి బస్సులో వస్తున్న క్రమంలో కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామం వద్ద పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో విషయాన్ని తోటి ప్రయాణికులకు తెలిపింది. వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపాడు.పురిటినొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోని మహిళలందరూ కలిసి ఆమెకు పురుడుపోశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న 108 వాహనం అక్కడి చేరుకొని మహిళను, పాపను గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆర్టీసి బస్సు డ్రైవర్ జిఎన్ గౌడ్ కండక్టర్ కిశోర్ ను ప్రయాణికులు అభినందించారు.