తగ్గుతుందన్నారు..కానీ ఏకంగా రూ.29,400 పెరిగిన పసిడి

దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. బంగారం ధర వరుసగా రెండోసారి గురువారం భారీగా పెరిగింది. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా వీటి ధరలు పుంజుకున్నాయి. అమెరికా, చైనా దేశాలు ఒకదానిపై మరొకటి సుంకాలను ప్రకటిస్తున్న నేపథ్యంలోనే బంగారం ధరలు పెరగడం విశేషం. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 2025న హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,940 పెరిగి, రూ.93,380కి చేరింది. అంటే 100 గ్రాములకు ఏకంగా రూ.29,400 పెరిగింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,700 పెరిగింది, రూ.85,600కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా వరుసగా రూ.2,210 పెరిగి, ప్రస్తుతం రూ.70,040 స్థాయికి చేరుకుంది.
కారణాలివేనా..
ఈ బంగారం ధరల పెరుగుదల ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విషయంలో వెనక్కి తగ్గడం సహా యుద్ధ పరిస్థితులు, ఎకానమీ మీద ప్రభావం చూపించాయి. దీంతో పసిడికి జాతీయ డిమాండ్ కూడా పెరిగింది. ఇలాంటి అంశాలు మార్కెట్ పరిస్థితులను ప్రభావితం చేయడంతో బంగారం ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో గత వారం పడిపోయిన ధరలను మళ్లీ పుంజుకునేలా చేశాయి. దీంతో సామాన్యులు ఇప్పుడు పసిడి కొనుగోలు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
ఇంకా పెరుగుతాయా..
వాణిజ్య యుద్ధంతో పాటు, భవిష్యత్ ఆర్థిక సంక్షోభంపై అనిశ్చితి కూడా బంగారం ధరలను ప్రభావితం చేసింది. రిస్క్ సెంటిమెంట్లు అంటే ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి, ఇన్వెస్టర్లను బంగారం లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఆకర్షిస్తోంది. వడ్డీ రేట్ల అంచనాలు తగ్గడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయి. భవిష్యత్లో అమెరికా, చైనా మధ్య సుదీర్ఘ వాణిజ్య యుద్ధం కొనసాగితే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వెండి ధరలు కూడా
హైదరాబాద్లో వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. వెండి ధర ఒక కిలోకు రూ.2,000 పెరిగి రూ.1,04,000 వద్ద ట్రేడవుతోంది. అలాగే, 100 గ్రాముల వెండి ధర రూ.200 పెరిగి రూ.10,400కి చేరుకుంది. ఇది బంగారం ధరల పెరుగుదలతోపాటు సమన్వయం అయ్యి, వెండి కూడా ఒక లాభం సాధించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా మారింది, అందుకే ఇన్వెస్టర్లు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు....