ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలి కలెక్టర్
జోగులాంబ గద్వాల 2మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు మరియు వాటి పనితీరు, ఫ్లయింగ్, సెట్టింగ్ స్క్వాడ్ పర్యవేక్షణ తదితర వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్కు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు మరియు ఇతర సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. వైద్య సిబ్బంది పరీక్షలు ముగిసే వరకు అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలు సహా ఇతర అవసరమైన పత్రాలను నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సురక్షితంగా సంబంధిత తపాలా కార్యాలయంకు పంపించాలన్నారు. అనంతరం పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ఈ పర్యటనలో చీఫ్ సూపరింటెండెంట్ రాజేశ్వర్, పరీక్ష కేంద్రం ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
...............................................................