ప్రజలు హోలీ పండుగను శాంతియుతంగా, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి
హోలీ పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
లోతట్టు ప్రదేశాల్లో స్నానాల సమయంలో యువత జాగ్రత్తలు పాటించాలి
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.
జోగులాంబ గద్వాల 2 మార్చ్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. హోలీ పండుగ సందర్భంగా జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్., ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలంతా హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సాంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగతో పాటు రంజాన్ మాసం కూడా కొనసాగుతున్నందున మతసామరస్యాన్ని కాపాడుతూ పరస్పర గౌరవంతో పండుగలు నిర్వహించుకోవాలని తెలిపారు. మత పెద్దలతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అతివేగం, రష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రధాన చౌరస్తాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై లేదా బహిరంగ ప్రదేశాల్లో బలవంతంగా రంగులు, రంగు నీళ్లు చల్లకూడదని స్పష్టం చేశారు. బైకులు, కార్లలో గుంపులుగా తిరిగి శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని హెచ్చరించారు.
హోలీ అనంతరం చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో యువత తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలంతా శాంతియుతంగా, భద్రంగా హోలీ పండుగను జరుపుకుని పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
.....