విద్యతోనే అభివృద్ధి సాధ్యం
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి
మిర్యాల జానకి రెడ్డి
సూర్యాపేట రూరల్, 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని యువజన నాయకులు మిర్యాల జానకి రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండల పరిధిలోని తాళకమ్మంపహడ్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిర్యాల జానకిరెడ్డి సుమారు ఎనిమిది వేల రూపాయల సొంత ఖర్చుతో పదో తరగతి విద్యార్థులకు ఫ్యాడ్ లు, పెన్నులతో పాటు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా విద్యార్థులను విద్యారంగంలో ప్రోత్సహించాలనే సంకల్పంతో పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులతోపాటు పరీక్ష సామాగ్రి అందజేస్తున్నానని, అదేవిధంగా పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ బహుమతి కింద 5,016, ద్వితీయ బహుమతి కింద 4,016 లు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ శాతం పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నందున వారిని విద్యారంగంలో ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాల్సిన అవసరం తెలిపారు. గత పది సంవత్సరాలుగా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన మిర్యాల జానకిరెడ్డిని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనయ్య, ఉపాధ్యాయులు ఆడెం, యువకులు గుడిపూడి రాము, లక్ష్మణ్, రాము, హరీష్, సందీప్,శేఖర్ రెడ్డి, లింగారెడ్డి, బద్రి తదితరులు పాల్గొన్నారు.